వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రూల్స్ గురించి క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. రెండేళ్ల పాటు షెడ్యూల్ ప్రకారం ప్రతి జట్టు స్వదేశంలో విదేశాల్లో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. గెలిచిన మ్యాచ్ల పరంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా పట్టిక క్రమాన్ని నిర్ణయిస్తారు. పాయింట్ల పట్టికలో అంతిమంగా నిలిచే రెండు జట్లు ఫైనల్స్కు అర్హత సాధస్తాయి. ఈ ఫైనల్లో గెలిచిన జట్టును ఛాంపియన్గా ప్రకటిస్తారు.
అయితే టెస్టు ఫార్మాట్ ప్రపంచకప్ అయిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రూల్స్పై ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఓ ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతను తేల్చడానికి ఇది టోర్నమెంట్ కాదని అన్నాడు. తుది పోరులో భాగంగా టాప్-2లో నిలిచిన జట్లకు మూడు మ్యాచ్లను నిర్వహించి, విజేతను తేల్చాలని సూచించాడు. ఆ మ్యాచ్లు కూడా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒక్కో మ్యాచ్ నిర్వహించాలని అన్నాడు.

''వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను మూడు మ్యాచ్లుగా చూడాలనుకుంటున్నాను. ఇది విజేతను తేల్చడానికి మెరుగైన మార్గంగా భావిస్తున్నాను. ఓ సెషన్లో పైచేయి సాధించి టెస్టు మ్యాచ్ను గెలవచ్చు. కానీ మూడు మ్యాచ్లు అయితే అన్ని విభాగాల్లో గొప్పగా రాణించి సత్తాచాటాల్సి ఉంటుంది. ఇక అవి.. ఒకటి భారత్, మరొకటి ఇంగ్లండ్, ఇంకొక్కటి ఆస్ట్రేలియాలో నిర్వహించాలి''
''అయితే వాటిని నిర్వహించే సమయం కూడా కీలకమే. ఇక డబ్యూటీసీ టోర్నమెంట్ కాదు. సెమీఫైనల్స్కు అర్హత సాధించి రెండు మ్యాచ్లు గెలిస్తే టైటిల్ సాధించడం కాదు. రెండేళ్ల పాటు సైకిల్లో స్థిరంగా సత్తాచాటాల్సి ఉంటుంది'' అని లైయన్ అన్నాడు.ఇప్పటివరకు రెండు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లు జరిగాయి. 2019-2021 సైకిల్లో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ గెలిచాయి. అయితే ఫైనల్లో కివీస్ గెలిచి ట్రోఫీని అందుకుంది. అనంతరం విరాట్ కోహ్లి కూడా లైయన్ ఇప్పుడు పేర్కొన్న వ్యాఖ్యలనే చేశాడు.
2021 డబ్ల్యూటీసీ ఫైనల్ మాత్రమే కాదు, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. రెండేళ్ల పాటు అన్ని జట్లపై సత్తాచాటి టేబుల్ టాప్లో నిలవడం, ఆ తర్వాత టైటిల్ పోరులో ఓడటం టీమిండియాకు అలవాటుగా మారింది. దీంతో టైటిల్ పోరును ఓ టెస్టు మ్యాచ్గా కాకుండా మూడు టెస్టు మ్యాచ్లు నిర్వహించాలని భారత మాజీలు, క్రికెటర్ల వాదన. ఇప్పుడు భారత్కు మద్దతుగా లైయన్ కూడా వ్యాఖ్యలు చేయడం విశేషం.