
మెల్బోర్న్: టీమిండియా టెస్ట్ బ్యాట్స్మన్ చేటేశ్వర్ పుజారా కోసం మరికొన్ని వ్యూహాలూ సిద్ధంగా ఉన్నాయని, వాటితో తమ ఉచ్చులో బిగిస్తామనే నమ్మకంతో ఉన్నామని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ పేరొన్నాడు. తొలి టెస్టులో పుజారాను కట్టడి చేసినప్పటికీ.. సిరీస్లోని మిగతా మ్యాచ్ల్లో అతని నుంచి తమ జట్టుకు ప్రమాదం పొంచి ఉందన్నాడు. స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ లోటును భర్తీ చేయగల ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారని లైయన్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్డే టెస్టు ప్రారంభంకానుంది.
తాజాగా నాథన్ లైయన్ మాట్లాడుతూ... 'నేను జట్టు రహస్యాలు బయటపెట్టలేను. కానీ ప్రపంచ స్థాయి బ్యాట్స్మన్ అయిన చేటేశ్వర్ పుజారాతో సిరీస్లోని మిగతా మ్యాచ్ల్లో మాకు పెద్ద సవాలే ఎదురుకానుంది. సిరీస్కు ముందు అతణ్ని కట్టడి చేయడం గురించి చర్చించుకున్నాం. ఆ దిశగా అడిలైడ్ టెస్టులో కొన్ని ప్రణాళికలు పనిచేశాయి. మరికొన్ని వ్యూహాలూ సిద్ధంగా ఉన్నాయి. అతను బరిలో దిగితే మా ఉచ్చులో బిగిస్తామనే నమ్మకంతో ఉన్నా. ప్రపంచ ఉత్తమ ఆటగాడిని సవాలు చేయడం సరదాగా ఉంటుంది. పుజారా కూడా అలాంటి ఆటగాడే' అని అన్నాడు.
అడిలైడ్ వేదికగా గులాబి బంతితో జరిగిన డే/నైట్ టెస్టులో కోహ్లీసేన చిత్తుగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్లో క్రీజులో కుదురుకున్న చేటేశ్వర్ పుజారా (43)ను నాథన్ లైయన్ ఔట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్లో 8 బంతులు ఆడిన పుజారా.. పాట్ కమిన్స్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్వదేశానికి రావడంతో అజింక్య రహానే, పుజారా వంటి సీనియర్లపై బాధ్యత పెరిగింది. వారిప్పుడు కచ్చితంగా రాణించాల్సిన అవసరముంది.
స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ లోటును భర్తీ చేయగల ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారని లైయన్ అభిప్రాయపడ్డాడు. 'విరాట్ కోహ్లీని భర్తీ చేసే ఆటగాళ్ల పేర్లు చెప్పాలంటే.. అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారా. వీళ్లే కాకుండా లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కూడా జట్టులో ఉన్నారు. కాబట్టి ఆ లోటు కనిపించదనే అనుకుంటున్నా. బాక్సింగ్ డే టెస్టులో ఎదురు కానున్న కఠిన సవాలుకు మేం మెరుగ్గా సిద్ధమవాల్సి ఉంది' అని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో టీమ్ఇండియా 0-1తో వెనకబడింది.