
బ్రిస్బేన్: టీమిండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఎనిమిదవ వికెట్ కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ వేసిన 102వ ఓవర్ నాలుగో బంతికి పాట్ కమిన్స్ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. శనివారం ఉదయం 274/5 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ఆసీస్ కొనసాగించింది. టీ నటరాజన్ వేసిన ఈరోజటి మొదటి ఓవర్లోనే కామెరాన్ గ్రీన్ రెండు ఫోర్లు బాదాడు. ఆపై టిమ్ పైన్ కూడా చెత్తబంతులకు మాత్రమే బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది.
ఈ క్రమంలోనే టిమ్ పైన్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది 9వ అర్ధ శతకం. అయితే శార్దుల్ ఠాకుర్ వేసిన 100వ ఓవర్లో స్లిప్లో రోహిత్ శర్మ చేతికి చిక్కి పైన్ (50; 104 బంతుల్లో 6x4) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో కామెరూన్ గ్రీన్ కూడా (47; 107 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఆరో వికెట్కు 111 పరుగులు జోడించాడు. శార్దుల్ వేసిన మరుసటి ఓవర్లో కమిన్స్ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్ బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకుర్ బౌలింగ్లో ఇద్దరు కలిసి నాలుగు బౌండరీలు, ఓ సిక్స్ బాదారు. దీంతో ఆసీస్ స్కోర్ 350 పరుగుల మార్క్ దాటింది. 108 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్ (16), లైయన్ (24) ఉన్నారు. ఠాకుర్ మూడు వికెట్లు పడగొట్టాడు.