
2018 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్
మ్యాచ్లో టీమిండియా తుది జట్టు ఎంపికపై పొరపాట్లు జరిగిన నేపథ్యంలో ఫార్మాట్కో కోచ్ పద్ధతి బాగుంటుందని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు. బుధవారం ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుస్సేన్ మాట్లాడుతూ... 'కెప్టెన్సీని షేర్ చేసుకోవడమనేది వ్యక్తి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా తన మాట నెగ్గాలనుకునే విరాట్.. మరొకరితో నాయకత్వ పగ్గాలు పంచుకోవడమనేది కష్టం. అతను ఎవరితోనూ అలాంటి బాధ్యతలు పంచుకునేందుకు ఇష్టపడడు' అని అన్నాడు.

ఫార్మట్కు ఒక కోచ్ ఉండాలనే కొత్త ప్రతిపాదన:
'ఇంగ్లండ్ జట్టు విషయానికొస్తే ఇయాన్ మోర్గాన్, జో రూట్ రూపంలో ఇద్దరు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరికి ఎక్కడా కూడా అభిప్రాయబేధాలు లేవు. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లాంటి జట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు' అని నాజర్ హుస్సేన్ తెలిపాడు. ఇక ఫార్మట్కు ఒక కోచ్ ఉండాలనే కొత్త ప్రతిపాదనను హుస్సెన్ తెరపైకి తీసుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బెయిలీస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయవంతం అయ్యాడు కానీ టెస్టు క్రికెట్లో అంతగా సక్సెస్ కాలేదన్నాడు. బెయిలీస్ శిక్షణలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ విజయం సాధించింది కానీ టెస్టుల్లో విఫలమైందన్నాడు. ఈ కారణంగానే మూడు ఫార్మట్లకు వేర్వేరు కోచ్లు ఉంటే బాగుంటుందని హుస్సెన్ పేర్కొన్నాడు.

భారత సెలక్షన్ విధానంపై మండిపడ్డ హుస్సేన్:
టీమిండియా సెలక్షన్ విధానంను కూడా నాజర్ హుస్సేన్ తీవ్రంగా విమర్శించాడు. 'బీసీసీఐ సెలక్షన్ కమిటీ నాలుగో స్థానంలో ఆటగాడిని కనిపెట్టడంలో విఫలమైంది. చాలా మంది మంచి బ్యాట్స్మన్ ఉన్నప్పటికీ నాలుగో స్థానంను పొందలేకపోయారు. భారతదేశంలో చాలా మంది ఆటగాళ్లకు టాలెంట్ ఉంది. కానీ ఓ రెండు వైఫల్యాలకే ఆ ఆటగాడిని తప్పిస్తారు' అని మండిపడ్డాడు. ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్ని ఫార్మట్లలో అత్యుత్తమ కోచింగ్ ఇస్తున్నాడని, అతడి శిక్షణలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని హుస్సెన్ ప్రశంసించాడు.

వ్యక్తిగత రికార్డులకు పెద్దగా విలువివ్వడు:
ఇటీవల నాజర్ హుస్సేన్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మన్ అని కొనియాడాడు. అతడు వ్యక్తిగత రికార్డులకు పెద్దగా విలువివ్వడని హుస్సేన్ పేర్కొన్నాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో లక్ష్యఛేదన సమయంలో కోహ్లీ బ్యాటింగ్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. ఎదురుగా ఎంత లక్ష్యమున్నా ఏ మాత్రం ఆందోళన చెందడు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతాడు. ఈ క్రమంలో కోహ్లీ వ్యక్తిగత మైలురాళ్లకు ఏనాడు ప్రాధాన్యం ఇవ్వడు. కేవలం జట్టు గెలిచిందా లేదా అనేదే అతడికి ముఖ్యం' అని హుస్సేన్ అన్నాడు.


Click it and Unblock the Notifications












