
చాలా కాలం ఆడే సత్తా ఉంది:
స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో నాసిర్ హుసేన్ శనివారం మాట్లాడుతూ... 'భారత జట్టుకు ఎంపికయ్యేంత సామర్థ్యం ధోనీలో ప్రస్తుతముందా అంటే.. ఈ ప్రశ్న ఆటగాళ్లకు అందరికీ వర్తిస్తుంది. నా దృష్టిలో అయితే ఇంకా చాలా కాలం ఆడే సత్తా ధోనీకి ఉంది. లక్ష్య ఛేదనలో ఒకటి రెండు సార్లు అతడు తప్పులు చేశాడు. ఇందులో ప్రపంచకప్ కూడా ఒకటి. ఇవి ఆటలో సహజమే. ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. అతడు భారత క్రికెట్కు ఎంతో చేసాడు. అత్యుత్తమ సారధి' అని అన్నాడు.

రిటైరవ్వాలని ఒత్తిడి పెంచొద్దు:
'ధోనీలో చాలా టాలెంట్ మిగిలే ఉంది. మహీ ఒక్కసారి వెళితే మళ్లీ అతడిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. తరంలో ఒక్కసారే వచ్చే దిగ్గజాలు కొందరు ఉంటారు. ధోనీ ఆ కోవకు చెందిన వాడే. ఇంతతొందరగా అతడిని రిటైరవ్వాలని ఒత్తిడి పెంచొద్దు. ధోనీ మనసులో ఏముందో అతడి మాత్రమే తెలుసు. సెలెక్టర్లు ఆటగాళ్లను ఎన్నుకుంటారు. వారిదే తుది నిర్ణయం' అని 52 ఏళ్ల హుసేన్ చెప్పుకొచ్చాడు. 1999-2003 మధ్య ఇంగ్లాండ్కు నాసిర్ హుసేన్ నాయకత్వం వహించాడు.

భవితవ్యం ప్రశ్నార్థకంగా:
2004లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ధోనీ.. తొలుత పవర్ హిట్టర్గా వెలుగులోకి వచ్చాడు. ముఖ్యంగా.. పాకిస్థాన్తో జరిగిన సిరీస్లో మిడిలార్డర్లో ఆడిన ధోనీ తన ఫినిషింగ్ స్కిల్స్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం మైదానానికి దూరమైన ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఐపీఎల్తోనే రీ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ..మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ వాయిదా పడటం.. ఇప్పడు జరుగుతుందో లేదోననే సందిగ్దత నెలకొనడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications












