

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ప్రారంభమైంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి అరంగేట్రం చేశాడు.
విహారికి ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయర్ విహారి. జట్టులో కరుణ్ నాయర్ రూపంలో మరో సీనియర్ బ్యాట్స్మన్ ఉన్నప్పటికీ, అతడిని కాదని విహారికి తుది జట్టులో చోటు కల్పించారు. అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు.
మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం సౌతాంప్టన్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్స్టో మళ్లీ జట్టు కీపింగ్ బాధ్యతలను అందుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్కు ఇదే చివరి టెస్టు. ఈ మ్యాచ్ తర్వాత అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు.
ఈ సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి అలెస్టర్ కుక్ ప్రత్యేకమైన క్యాప్ని అందుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఇప్పటికే ఇంగ్లాండ్ 1-3తేడాతో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.
భారత జట్టు: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లాండ్ జట్టు: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, మొయిన్ అలీ, జో రూట్ (కెప్టెన్), బెయిర్స్టో (వికెట్ కీపర్), బెన్స్టోక్స్, జోస్ బట్లర్, కుర్రాన్, ఆదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్