ఏపీలో విశాఖపట్నం ACA-VDCA క్రికెట్ స్టేడియంలోని రెండు స్టాండ్లకు భారత దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, రవి కల్పన పేర్లను పెట్టాలని నిర్ణయించారు. ఈ స్టాండ్ల ప్రారంభోత్సవం అక్టోబర్ 12న భారత్-ఆస్ట్రేలియా మహిళా వరల్డ్ కప్ మ్యాచ్తో పాటు నిర్వహించబడుతుంది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఆగస్టు 2025లో 'బ్రేకింగ్ బౌండరీస్' కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్కు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. స్మృతి మంధాన చేసిన అభ్యర్థనను అమలు చేస్తూ.. మంత్రి నారా లోకేష్ తక్షణమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA)తో సంప్రదించారని, దీని ఫలితంగా విశాఖపట్నం స్టేడియంలో మహిళా క్రికెట్ దిగ్గజాల పేర్లతో స్టాండ్లను నామకరణం చేసి వారిని సత్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్ ఇటీవల ఆవిష్కరించబడిన నేపథ్యంలో.. మిథాలీ రాజ్ కూడా అదే తరహా గౌరవాన్ని అందుకోబోతున్నారు. ఇప్పటికే అనేక మంది దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టాండ్లు , పెవిలియన్లు ఉన్నాయి.

మంత్రి నారా లోకేష్ హర్షం
స్మృతి మంధాన చేసిన ఆలోచనాత్మక సూచన ప్రజల మనోభావాలను తాకిందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ ఆలోచనను తక్షణమే అమలు చేయడం లింగ సమానత్వం పట్ల, మహిళా క్రికెట్ మార్గదర్శకులను గౌరవించడంలో ఉమ్మడి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. స్టాండ్లకు పేర్లు మార్చడం ద్వారా మహిళా క్రికెటర్లను గౌరవించడమే కాకుండా క్రీడలకు వారి అపారమైన కృషిని సూచిస్తుంది. దేశంలోని బాలికలు మహిళా క్రికెట్ను వృత్తిగా స్వీకరించడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
మిథాలీ రాజ్
భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో 12 టెస్ట్ మ్యాచ్లలో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో సహా 699 పరుగులు చేసింది. 232 వన్డే మ్యాచ్లలో 7 సెంచరీలు, 64 అర్థ సెంచరీలతో సహా 7,805 పరుగులు సాధించింది. 89 టీ20 మ్యాచ్ లలో 2,364 పరుగులు చేసింది.
రవి కల్పన
ఏపీలో జన్మించిన రవి కల్పన వికెట్ కీపర్-బ్యాటర్గా రాష్ట్ర స్థాయిలో రాణించింది. ఆమె భారత్ తరఫున 7 వన్డే మ్యాచ్లు కూడా ఆడింది. ఈ నిర్ణయం మహిళా క్రీడాకారుల కృషికి, ఘనతలకు దక్కిన గొప్ప గౌరవంగా చూడవచ్చు.