నమీబియా: క్రికెట్ ఆడుతూ గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నమీబియాకు చెందిన ఓ ఆటగాడు మృతి చెందాడు. నమీబియాకు చెందిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రెమాండ్ వాన్ స్కూర్ శుక్రవారం నాడు కన్నుమూశాడు. అతని వయస్సు 25.
వింధోక్లో అతను క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెలో నొప్పి వచ్చింది. అతనిని ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం నాడు మృతి చెందాడు.
రేమాండ్ తన 25 ఏళ్ల వయస్సులో హఠాత్తుగా కన్నుమూశాడని, గుండె నొప్పితో బాధపడి కూలబడ్డాడని, ఆసుపత్రిలో అయిదు రోజులు చికిత్స అనంతరం మృతి చెందాడని ఐసీసీ ఈ రోజు (శనివారం) చెప్పింది.

రేమాండ్ వాన్ స్కూర్ తన దేశం నమీబియా తరఫున 200 సార్లకు పైగా ఆడాడు. ఇటీవల ఐసీసీ వరల్ట్ టీ ట్వంటీ క్వాలిఫయర్ 2015లో, అలాగే ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ మ్యాచ్ (ఐర్లాండ్తో జరిగింది)లో ఆడాడు.
గత ఆదివారం (నవంబర్ 15)న ఆడుతూ కుప్పకూలాడు. ఇతను రైడ్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. వన్ డే చాలెంజ్ గేమ్లో ఆడుతుండగా అతను పదిహేను పరుగుల వద్ద కుప్పకూలి, రిటైర్ హర్ట్గా వెనుదిరిగాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు.
రెమాండ్ 92 ఫస్ట్ క్లాస్, 103 లిస్ట్ ఏ (50 ఓవర్లు), 70 ట్వంటీ 20 మ్యాచులు ఆడాడు. ఇతను మూడు ఫార్మాట్లలో కలిపి 8వేలకు పైగా పరుగులు చేశాడు. రెమాండ్ మృతి పట్ల నమీబియా క్రికెట్ సంఘం సంతాపం తెలిపింది.