హైదరాబాద్: ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్ ముగిసిన అనంతరం శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీలంకతో తలపడే భారత జట్టుని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నవంబర్ 16న కోల్కతా వేదికగా తొలి టెస్టు జరగనుంది.
దీనికి ముందు నవంబర్ 11నుంచి ఆతిథ్య జట్టు బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో శ్రీలంకతో తలపడే బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుని కూడా సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. ఈ జట్టులో హైదరాబాద్కు చెందిన ఐదుగురు రంజీ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
ఆల్రౌండర్లు ఆకాశ్ భండారి, సీవీ మిలింద్ సహా పేస్ బౌలర్ రవికిరణ్, బ్యాట్స్మెన్ తన్మయ్ అగర్వాల్, బావనక సందీప్లు బోర్డు లెవెన్ జట్టుకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ వికెట్ కీపర్ నమన్ ఓజా ఈ జట్టుకు సారథ్యం వహిస్తాడు. ఈ జట్టులో హైదరాబాద్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రంజీ జట్ల నుంచి మాత్రమే ఆటగాళ్లను తీసుకున్నారు.
రంజీల నుంచి యువ ఆటగాళ్లను తప్పించవద్దని కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జట్టు వచ్చే నవంబర్ 11, 12 తేదీల్లో శ్రీలంకతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్లో తలపడుతుంది.
శ్రీలంకతో వార్మప్ మ్యాచ్కి బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు:
నమన్ ఓజా (కెప్టెన్, వికెట్ కీపర్), బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, ఆకాశ్ భండారి, రవికిరణ్, సీవీ మిలింద్, సంజూ శామ్సన్, జీవన్జ్యోత్ సింగ్, అభిషేక్ గుప్తా, రోహన్ ప్రేమ్, జలజ్ సక్సేనా, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్.