
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో నమీబియా సునాయాస విజయం అందుకున్నది. స్కాట్లాండ్ నిర్ధేచించిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా మరో ఐదు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్రెయిగ్ విలియమ్స్ (23; 29 బంతుల్లో 1x6), మైఖేల్ వాన్ లింగేన్ (18; 24 బంతుల్లో 2x4) పరుగులు చేయగా.. ఆల్రౌండర్ జేజే స్మిత్ (32; 23 బంతుల్లో 2x4, 2x6), డేవిడ్ వైస్ (16; 14 బంతుల్లో 1x6) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా స్మిత్ చివరి వరకు క్రీజులో ఉండి గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఉత్కంఠకు దారితీసినా:
స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన నమీబియా ఓపెనర్లు క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగేన్ ఆచితూచి ఆడారు. బౌండరీల జోలికి పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించారు. అయితే జట్టు స్కోర్ 28 పరుగుల వద్ద లింగేన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జేన్ గ్రీన్ (9), గెర్హార్డ్ ఎరాస్మస్ (4), విలియమ్స్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ సమయంలో డేవిడ్ వైస్, జేజే స్మిత్ అద్భుతంగా ఆడి జట్టును విజయం వైపు నడిపించారు. అయితే వైస్, జాన్ ఫ్రైలింక్ (2) ఒక్కసారిగా ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. స్మిత్ చివరి ఓవర్ మొదటి బంతికి సిక్స్ బాది నమీబియాకు విజయాన్ని అందించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ రెండు వికెట్లు తీశాడు.
తొలి ఓవర్లోనే మూడు వికెట్లు:
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ నిర్ణీత 20 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే స్కాట్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్లు జార్జ్ మున్సే, కాలమ్ మెక్లాయిడ్, కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. రూబెన్ ట్రంపుల్మన్ వేసిన తొలి బంతికే స్కాట్లాండ్ ఓపెనర్ మున్సే (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బంతికి మెక్లాయిడ్ (0) వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ మరుసటి బంతికే బెర్రింగ్టన్ (0) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు గోల్డెన్ డక్గా వెనుతిరగడంతో స్కాట్లాండ్కు కోలుకోలేని దెబ్బతగిలింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
ఆదుకున్న లీస్క్:
అయితే మరో ఓపెనర్ మాథ్యూ క్రాస్ (19) ఫర్వాలేదనిపించాడు. క్రెయిగ్ వాలేస్ (4) నిరాశపరిచాడు. ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో మైకేల్ లీస్క్ (44), క్రిస్ గ్రీవ్స్ (25) జోడీ స్కాట్లాండ్ జట్టును ఆదుకుంది. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరి వల్లే ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 17వ ఓవర్లో జోరుమీదున్న లీస్క్ను జేజే స్మిత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మార్క్ వాట్ (3) పెవిలియన్ చేరాడు. ఇక 20వ ఓవర్ చివరి బంతికి గ్రీవ్స్ రనౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయిన స్కాట్లండ్ 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్ 3, జాన్ ఫ్రైలింక్ 2.. జేజే స్మిత్, డేవిడ్ వీజ్ చెరో వికెట్ తీశారు.