టీ20 వరల్డ్ కప్-2024లో ఒమన్ తమ తొలి మ్యాచ్లో బ్యాటుతో విఫలమైంది. గ్రూప్-బీలో బార్బడోస్ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రంపెల్మన్ (4/21) నాలుగు వికెట్లు, వైసే (3/28) మూడు వికెట్లతో సత్తాచాటారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఒమన్కు శుభారంభమే దక్కలేదు. ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. ట్రంపెల్మన్ మొదటి ఓవర్లో తొలి రెండు బంతులకే కశ్యప్, కెప్టెన్ అకిబ్ ఇలియాస్ను గోల్డెన్ డకౌట్ చేశాడు. కాసేపటికే మరో ఓపెనర్ నసీమ్ ఖుషి (6; 6 బంతుల్లో, 1 ఫోర్)ను కూడా ఔట్ చేశాడు. దీంతో ఒమన్ 10 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జీషన్ మక్సూద్ (22; 20 బంతుల్లో, 4 ఫోర్లు)తో కలిసి ఖలీద్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడారు. పవర్ప్లేలో ఒమన్ 36 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్లో జీషన్ పెవిలియన్కు చేరాడు. అనంతరం ఒమన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. సహచరులు వెనుదిరుగుతున్న ఖలీద్ స్కోరుబోర్డును నెమ్మదిగా ముందుకు నడిపాడు. కానీ అతను ఏడో వికెట్ రూపంలో వెనుదిరగడంతో ఒమన్ ఆలౌట్ కావడానికి ఎక్కువసేపు పట్టలేదు.
ఒమన్ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఖలీద్, జీషన్, అయాన్ ఖాన్ (15; 21 బంతుల్లో, 1 సిక్సర్), షకీల్ అహ్మద్ (11; 9 బంతుల్లో; 2 ఫోర్లు) సింగిల్ డిజిట్ దాటారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మన్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, వైసే 3.4 ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. గెర్హార్డ్ రెండు, బెర్నడ్ ఒక్క వికెట్ తీశారు.