హైదరాబాద్: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గత నవంబరులో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు యాంటీ డోపింగ్ అప్పీల్స్ ప్యానెల్ (ఏడీఏపీ)లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఆర్.వి.ఈశ్వర్ నేతృత్వంలోని ఈ కమిటీలో సెహ్వాగ్తో పాటు అడ్వొకేట్ విభా దత్త, ఢిల్లీ మాజీ కెప్టెన్ వినయ్ లంబ, డాక్టర్ నవీన్ దంగ్, డాక్టర్ హర్ష్ మహాజన్ ఇతర సభ్యులుగా ఉన్నారు.
గత నవంబర్లో ఏర్పాటైన ఈ ప్యానెల్... డోపింగ్లో పట్టుబడిన ఆటగాళ్ల నిషేధంపై విచారిస్తుంది. తమకు విధించిన శిక్షలను అథ్లెట్లు ఏడీఏపీలో సవాలు చేయవచ్చు. అయితే, ఇప్పటివరకు ఒక్క విచారణకు కూడా అతడు హాజరు కాలేదు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ఈ ప్యానెల్లో ఉండడంలో ప్రయోజనమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
"ఇప్పటివరకు పలువురి ఆటగాళ్ల సస్పెన్షన్పై ఈ ప్యానెల్ విచారించింది. కానీ ఏ ఒక్కసారి వీరూ హాజరు కాలేదు. అలాగని ఆ పదవికి అతను రాజీనామా చేయలేదు" అని ఓ నాడా అధికారి చెప్పాడు. తాజాగా, ఆగస్టు నెల 10, 14, 23 తేదీల్లో ఈ ప్యానెల్ విచారణ చేపట్టనుంది. మరి వీటికైనా అతను హాజరవుతాడో లేదో తెలియదని సదరు అధికారి సందేహం వ్యక్తం చేశారు.