హైదరాబాద్: భారత జట్టులో విరాట్ కోహ్లీ ఎంపికే తన ఉద్యోగం పోయేందుకు కారణమైందని మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ తెలిపాడు. వెటరన్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ రాసిన 'డెమోక్రసీ ఎలెవన్' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు మాజీ క్రికెటర్లు హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి హాజరైన దిలీప్ వెంగ్సర్కార్ ఓ సరికొత్త విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాని విజయ పథంలో నడిపిస్తోన్న విరాట్ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయడం వల్లే తనను ఉద్యోగంలో నుంచి తొలగించారని ఈ సందర్భంగా వెంగ్సర్కార్ వివరించాడు.

'2008లో కోహ్లీ కెప్టెన్సీలోని అండర్-19 భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఆ టోర్నీలో కోహ్లీ ప్రదర్శన చూసి టీమిండియాకు ఎంపిక చేశాను. తమిళనాడు క్రికెటర్ బద్రీనాథ్ స్థానంలో విరాట్ కోహ్లీకి జట్టులో చోటు కల్పించాను. నేను చేసిన ఈ మార్పు బోర్డులో ఉన్న చాలా మందికి నచ్చలేదు' అని వెంగ్ సర్కార్ తెలిపాడు.
'ఇదే విషయమై బోర్డు ట్రెజరర్, తమిళనాడు క్రికెట్ కంట్రోలర్ ఎన్ శ్రీనివాసన్ అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్కు ఫిర్యాదు చేశారు. కోహ్లీని ఎంపిక చేసిన ఆ మరుసటి రోజే నన్ను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తొలగించారు. నా ఉద్యోగం పోయింది కానీ, నేను ఎంపిక చేసిన జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. కోహ్లీ జట్టులో ఉన్నాడు' అని అన్నాడు.

2008లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరం కావడంతో విరాట్ కోహ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్లో విరాట్ కోహ్లీ 31.80 యావరేజితో 159 పరుగులు చేశాడు. ఈ సిరిస్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.