న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వల్ల భారత్ క్రికెట్ ప్రతిష్టకు భంగం కలగలేదని ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ చెన్నైలో వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ కోసం ఎంఆర్ఎఫ్ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన చెన్నైకి వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ విషయంలో శ్రీనివాసన్ ఎన్సీపి చీఫ్ శరద్ పవార్ను లాగారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఆయన శరద్ పవార్ పేరును ముందుకు తెచ్చారు. శరద్ పవార్కు చెప్పే తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం బిడ్డింగ్ వేసినట్లు తెలిపారు.
ఎంఆర్ఎఫ్ సంస్ధతో ఆయన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ముద్గల కమిటీ నివేదిక సుప్రీం కోర్టులో ఉన్నందున్న తాను మాట్లాడబోనని, ఎంఆర్ఎఫ్ సంస్ధతో ఒప్పందం కోసం తాను ఐసీసీ ఛైర్మన్ హోదాలో మాత్రమే చెన్నై వచ్చానని అన్నారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్ తన లాయర్ కపిల్ సిబల్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై జరుగుతున్న విచారణకు హాజరైన ఆయన తాను నిర్దోషినని, ఫిక్సింగ్ వ్యవహారానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అపెక్స్ కోర్టుకి తెలిపారు.

మ్యాచ్ ఫిక్సింగ్ పై ఆరోపణలు రాగానే విచారణకు ఆదేశించానని ఆయన కోర్టుకు చెప్పారు. సాక్షాత్తూ తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను న్యాయస్థానానికి తీసుకొచ్చిందే తానేనని సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఫిక్సింగ్ వ్యవహారం బయటకు రాగానే తాను చట్టానికి అనుగుణంగా వ్యవహరించానని శ్రీనివాసన్ వివరించారు.
ఇది ఇలా ఉంటే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్వవహారంపై విచారణ చేస్తున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ విషయంలో దోషులెవరో న్యాయస్థానం నిర్ధారిస్తుందని, ఐపీఎల్, ఇతర మ్యాచ్ల టికెట్ల అమ్మకాల వివరాలు సుప్రీం కోర్టుకు అందజేయాలని శ్రీనివాసన్ను ఆదేశించింది.
అలాగే ఆటగాళ్ల అమ్మకం, ఆటగాళ్ల ఎంపిక, ఫ్రాంచైజీల ఎంపిక, టెలీకాస్టింగ్ వివరాలు అందజేయాలని శ్రీనివాసన్ను కోరింది. బీసీసీఐ, ఐపీఎల్ ఆదాయ వివరాలన్నీ న్యాయస్థానానికి సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.