టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను ఔట్ చేసిన తర్వాత తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాని దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ తెలిపాడు. సూర్య అభిమానులు కొందరు తనని, తన భార్యను నెట్టింట్లో అసభ్యకరమైన మాటలతో దూషించారని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను భారత్ 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే.
తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా, రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ను సమం చేసింది. అయితే రెండో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ను షంసీ ఔట్ చేశాడు. అనంతరం అతడు 'షూ కాల్' సెలబ్రేషన్స్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి కీలక ప్లేయర్ సూర్యను ఔట్ చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

అయితే మ్యాచ్ అనంతరం తాను ఎదుర్కొన్న ఇబ్బందులను షంసీ ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించాడు. ''నా సెలబ్రేషన్స్ను నెగటివ్గా తీసుకున్నారు. అగౌరవంగా భావించారు. అసభ్యకరమైన మాటలతో నన్ను ఘోరంగా దూషించారు. నా భార్యను కూడా వేధించారు. దీన్ని ఎప్పటికీ సహించలేను. ప్లేయర్ల జోలికి వస్తే తట్టుకోవచ్చు. కానీ కుటుంబం జోలికి రావడం చాలా దారుణం. అది నీచమైనది''
''ఇలా చేయొద్దని ఆటగాళ్లు తమ అభిమానులకు చెప్పాలి. లేకపోతే దూషించడం తమ హక్కుగా కొందరు అభిమానులు భావిస్తారు. కొన్ని సార్లు మీ జట్టు గెలవలేకపోవచ్చు. అలాగే కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. కానీ జంతువుల్లా కాదు, మనుషుల్లా ప్రవర్తించాలి'' అని షంసీ అన్నాడు.
కాగా, రెండో టీ20 ముగిసిన అనంతరం షంసీ తన షూ కాల్ సెలబ్రేషన్స్ గురించి అప్పుడే వివరించాడు. అది సరదాగా చేస్తానని, ఆ సెలబ్రేషన్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. అంతేకానీ, ఏ ప్లేయర్ను అగౌరవపరచడానికి కాదని తెలిపాడు.