తన ఛేజింగ్ విజయ రహస్యం చెప్పిన విరాట్ కోహ్లీ!!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత బ్యాట్స్మన్లలో టాప్ పోసిషన్లో కొనసాగుతున్నాడు. మనోడికి రికార్డుల రారాజు, చేజింగ్ కింగ్ అనే బిరుదులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ బిరుదులు మాత్రం ఊరికే రాలేదు. ఫార్మాట్ ఏదైనా క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక లక్ష్య ఛేదనలో అయితే మరింత ధాటిగా ఆడుతాడు. ఛేదనలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కి సైతం సాధ్యంకాని రికార్డులని నెలకొల్పాడు. అయితే తాను ఇంతలా ఛేదనలో చెలరేగాడు గల కారణంను కోహ్లీ తెలిపాడు.

చేజింగ్ కింగ్:
సీబీ సిరీస్ 2012లో, ఆసియా కప్ 2012, 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో, 2014లో అడిలైడ్ టెస్టులో, 2016 టీ20 ప్రపంచకప్లో, 2019లో ఆస్ట్రేలియా సిరీస్ ఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడాడు. ఇవే కాక ఎన్నో ఛేదనలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇక బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్తో తాజాగా ఫేస్బుక్ లైవ్ సెషన్ ద్వారా మాట్లాడిన విరాట్ కోహ్లీ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఛేదనలో తన విజయ రహస్యం ఏంటో కూడా చెప్పాడు.

కవ్వింపులకి దిగితే:
'ఛేదన సమయంలో నా మైండ్ సెట్ సింపుల్గా ఉంటుంది. లక్ష్యాన్ని బట్టి ఇలా ఆడాలని ముందుగానే అనుకుంటా. ఓవర్కు ఎన్ని పరుగులు చేయాలో అని తెలుసుకుంటా. ప్రత్యర్థి జట్టు నుంచి ఎవరైనా కవ్వింపులకి దిగితే.. నా ఏకాగ్రత, కసి మరింత పెరుగుతుంది. నేను చిన్న వయసులో టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు ఛేదనలో భారత్ జట్టు ఓడిపోతే.. నేను ఒకవేళ ఆ మ్యాచ్లో ఉండింటే భారత్ని గెలిపించేవాడ్ని కదా అని అనుకునేవాడ్ని. దాంతో అప్పటి నుంచి అదే మైండ్సెట్తో ఉన్నా' అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు:
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

నాన్నను లంచం అడిగారు:
ఢిల్లీ జట్టులో తన సెలక్షన్ కోసం అధికారులు లంచం అడిగితే.. తన తండ్రి ప్రేమ్ కోహ్లీ తిరస్కరించాడని భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ చెత్రితో కలిసి సోషల్ మీడియాలో మాట్లాడిన విరాట్ కోహ్లీ తెలిపాడు. 'ఢిల్లీలో కొన్ని సమయాల్లో పనులు నిజాయితీగా జరగవు. ఉదాహరణకు సెలక్షన్ విషయంలో ఎవరో వ్యక్తి రూల్స్ ప్రకారం వెళ్లలేదు. అతను మా నాన్నతో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవ్వాలంటే.. లంచం ఇవ్వాలని అన్నాడట' అని విరాట్ తెలిపాడు. అయితే తన తండ్రి అందుకు ససేమీరా ఒప్పుకోలేదని అతను అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications