మైండ్ అలా..మనస్సు ఇలా..
ఇందులో మెజారిటీ మాత్రం ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు ఇంగ్లండ్కే జైకొడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. రెండో సెమీ ఫైనల్లో ఆ జట్టు ఆస్ట్రేలియాను ఖంగు తినిపించిన విధానమే. ఇదిలావుండగా- టీమిండియా మాజీ ఓపెనర్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు. ఏ జట్టు గెలుస్తుందనే విషయాన్ని ఆయన విస్పష్టంగా వెల్లడించలేదు. అయినప్పటికీ- ఆయన ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలని తన మైండ్ కోరుకుంటోందని గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆయన ఓ వ్యాసాన్ని రాశారు.
ఇంగ్లండ్ తిరిగి చూసుకోకూడదంతే!
27 సంవత్సరాల తరువాత తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ జట్టు.. ఇక వెనుదిరిగి చూసుకోకూడదని తన మైండ్ కోరుకుంటోందని అన్నారు. ఇన్నేళ్లకైనా ఆ జట్టు కప్ను అందుకోవాలని అభిలాషిస్తోందని చెప్పారు. తన మనసు మాత్రం న్యూజిలాండ్ వైపు ఉందని గంభీర్ తెలిపారు. ఆ జట్టు సైతం ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదని అన్నారు. పైగా- 2015లో మాత్రమే తొలిసారిగా ఫైనల్లోకి అడుగు పెట్టిందని గుర్తు చేశారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండర్లు గెలవాలని తన మనసు అకాంక్షిస్తోందని గంభీర్ అన్నారు. న్యూజిలాండ్ జట్టు కేప్టెన్ కేన్ విలియమ్స్పై విపరీతంగా ఆధారపడుతోందని అన్నారు. కేన్ విలియమ్సన్ ఓ హీరోలా మారారని కితాబిచ్చారు.
ఒత్తిడిని బాధ్యతగా భావిస్తోన్న విలియమ్సన్
జట్టుకు సారధ్య బాధ్యతలను వహించే సమయంలో ఏ ఆటగాడైనా కొంత ఒత్తిడికి గురవుతాడని, అది అతని బ్యాటింగ్పై ప్రభావం చూపుతుందని అన్నారు. కేన్ విలియమ్సన్ విషయంలో ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు. కేప్టెన్సీ బాధ్యతలను చేపట్టినప్పటి నంచీ అతను చెలరేగిపోయి ఆడుతున్నాడని, ఒత్తిడికి బదులు బాధ్యతగా భావిస్తున్నాడని చెప్పారు. అందుకే- తన మనసు కివీస్ గెలవాలని కోరుకుంటోందని అన్నారు.
ఏది జరిగినా చివరికి గెలిచేది మాత్రం క్రికెట్టేనని ముక్తాయింపునిచ్చారు.