సిడ్నీ: తన హృదయం భారత్ గెలుస్తుందని చెబుతుంటే, మనసు ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపుతోందని సునీల్ గవాస్కర్ అన్నాడు. గురువారం నాడు ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య సెమీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందించాడు. భారత్తో పాటు ఆస్ట్రేలియా కూడా ఫేవరేట్ అని చెప్పాడు.
ధోనీ సేన తొలుత బ్యాటింగ్ చేసి, భారీ పరుగులు చేస్తే విజయం మన వైపు ఖాయమన్నాడు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారత్కు ఇబ్బంది అని అన్నాడు. అంతేకాకుండా.. భారత్తో సిడ్నీ మైదానంలో ఇటీవల ఆడిన మ్యాచులలో ఆస్ట్రేలియా గెలిచిందని, అది వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాడు. నా గుండె భారత్ వైపు మొగ్గు చూపుతుంటే, మైండ్ మాత్రం ఆస్ట్రేలియా ఫేవరేట్గా చెబుతోందన్నాడు.
స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనడానికి ఆస్ట్రేలియా నెట్ సెషన్లో షేన్ వార్న్ సలహాలు తీసుకోవడం.. పెద్దగా పట్టించుకోవాల్సిన విషయమేమీ కాదని భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ అన్నాడు. టీమిండియాలో లెగ్ స్పిన్నర్ లేడు.. కాబట్టి ఆసీస్ ఆటగాళ్లు లెగ్స్పిన్ను ఎదుర్కొనే అవకాశం లేదన్నాడు. అశ్విన్, జడేజాలు వైవిధ్యమైన బౌలర్లని చెప్పాడు.
గవాస్కర్తో విభేదించిన లారా
సునీల్ గవాస్కర్తో వెస్టిండీస్ లెజెండ్ బ్రయాన్ లారా విభేదించాడు. సిడ్నీలో భారత్దే గెలుపు అన్నాడు. సిడ్నీ మైదానంలోని పరిస్థితులు ధోనీసేనకు అనుకూలంగానే ఉంటాయని చెప్పాడు. తనకు ఇష్టమైన ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడని భావిస్తున్నానని చెప్పాడు. భారత ఆటగాళ్లకు తగ్గట్టు సిడ్నీ పిచ్ బ్యాటింగ్, స్పిన్కు సహకరిస్తుందని, ధోనీ సేనకు గెలుపు ఖాయమని అన్నాడు.