స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి 2023 ఏడాది కమ్బ్యాక్ ఇయర్. వరుస వైఫల్యాలు, తీవ్ర విమర్శలను దాటుకుంటూ మునపటి విరాట్లా సూపర్ ఫామ్లోకి ఈ ఏడాది తిరిగొచ్చాడు. అసాధారణ రికార్డులు బద్దలుకొడుతూ విమర్శకుల నోళ్లు మూయించాడు. పరుగుల వరద పారిస్తూ ఈ ఏడాది కూడా భారత్కు ఎన్నో విజయాలు అందించాడు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి ఈ ఏడాదిని ఎంతో ప్రత్యేకంగా మలుచుకున్నాడు విరాట్ కోహ్లి. వన్డేల్లో 50 సెంచరీలు సాధించి సచిన్ (49) రికార్డును కోహ్లి అధిగమించిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ మరో రెండు రికార్డులను కోహ్లి నెలకొల్పాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో 765 పరుగులు చేసిన విరాట్ ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు.

అంతేకాకుండా ఏడు భిన్నమైన క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రికెట్లో 2000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర లిఖించాడు. అయితే వచ్చే ఏడాది కూడా విరాట్ కోహ్లి విశ్వరూపం చూస్తామని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాదిలో సత్తాచాటే ఆటగాళ్లు గురించి వివరిస్తూ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు.
'' వచ్చే ఏడాదిలో రాణించే ఆటగాళ్ల గురించి చెప్పాలంటే.. తొలుత గుర్తు వచ్చేది మెగాస్టార్ విరాట్ కోహ్లినే. దీనిలో ఎలాంటి సందేహం ఉండదు. 2023లో కోహ్లి గొప్పగా ఆడాడు. ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక అతడిపై, అతడు సాధించిన రికార్డులపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. కోహ్లి ఎంత గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విషయంపై దృష్టి సారించలేకపోయాం. టెక్నికల్గా నేను కూడా చూడలేకపోయా''
''కానీ విరాట్ కోహ్లి బ్యాట్ శబ్ధం, ముంబయిలో శ్రీలంకపై అతడు ఆడిన ఇన్నింగ్స్ గొప్పగా ఉన్నాయి. విరాట్ అభిమానులకు, టీమిండియా అభిమానులకు ఇది ఒక శుభవార్త. ఆటలోనూ, మానసికంగానూ విరాట్ కోహ్లి పటిష్టస్థితిలో ఉన్నాడు'' అని హుస్సేన్ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. ఈ వీడియోలో బాబర్ అజామ్ గురించి కూడా అతడు మాట్లాడాడు. వచ్చే ఏడాది అజామ్కు కూడా కలిసి వస్తుందని చెప్పాడు. కాగా, కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.