లక్ష్యం 2019 వరల్డ్ కప్: నిషేధం ఎత్తివేత అనంతరం శ్రీశాంత్
హైదరాబాద్: టీమిండియా పేసర్ శ్రీశాంత్పై బీసీసీఐ విధించి జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2013 ఐపీఎల్లో శ్రీశాంత్తో పాటు మరికొందరు ఆటగాళ్లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది.
ఢిల్లీలోని ట్రయల్ కోర్టు కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ను నిర్దోషిగా తేల్చినప్పటికీ... బీసీసీఐ మాత్రం నిషేధం తొలగించలేదు. దీంతో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు క్లీన్చిట్ ఇచ్చినా బోర్డు తనను కావాలని వేధిస్తోందని పిటిషన్ వేయగా, సోమవారం అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయితే, శ్రీశాంత్ విషయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేరళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీశాంత్ తాను తిరిగి భారత్ తరఫున ఆడతాననే నమ్మకం కలిగిందని ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. టీమిండియా జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నప్పుడు కంటే ఇప్పుడే ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు.

కోర్టు తీర్పు పట్ల సంతోషం
కోర్టు తీర్పు పట్ల శ్రీశాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. న్యాయస్థాలు దోషులుగా తేల్చిన మహ్మద్ ఆమీర్ లాంటి ఆటగాళ్లు.. ఐసీసీ, ఆయా దేశాల క్రికెట్ సంఘాల మద్దతుతో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఆడుతున్నారు. తాను కూడా త్వరలో భారత్ తరుపున క్రికెట్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

వారే నాకు స్ఫూర్తి
‘నేను క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ, కేరళ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇస్తే ప్రాక్టీస్ మొదలుపెడతా. నా వయసు 34 ఏళ్లు. సచిన్, మిస్బా, యూనిస్ ఖాన్ లాంటి ఆటగాళ్లలు 40 ఏళ్లు వచ్చే వరకు క్రికెట్ ఆడారు. వారే నాకు స్ఫూర్తి. 2019 ప్రపంచ కప్లో ఆడాలనేది నా కల. కానీ నేను వరల్డ్ కప్ ఆడితే అది నిజంగా అద్భుతమే అవుతుంది' అని శ్రీశాంత్ అన్నాడు.

టెస్టుల్లో 100 వికెట్లు తీయాలనేది నా లక్ష్యం
'కానీ నాకు నమ్మకం ఉంది. బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉంది. గంటకు 140 కి.మీ. వేగంతో బంతులేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. టెస్టుల్లో 100 వికెట్లు తీయాలనేది నా లక్ష్యం. ఇంకో 13 తీస్తే అది నెరవేరుతుంది. కేరళ తరఫున రంజీ ట్రోఫీ నెగ్గాలనేది నా చిరకాల వాంఛ. నా అనుభవాన్ని కేరళ ఆటగాళ్లతో పంచుకుంటా. నాకు ఆరు నెలలు సమయం ఇవ్వండి నేనేంటో చూపిస్తా' అని అన్నాడు.

కేరళ హైకోర్టు తీర్పుపై స్పందించిన బీసీసీఐ
మరోవైపు కేరళ హైకోర్టు తీర్పుపై బీసీసీఐ స్పందించింది. ‘కేరళ హైకోర్టు తీర్పు ఈ రోజే వచ్చింది. బీసీసీఐ న్యాయ విభాగం దాన్ని పరిశీలిస్తుండటంతో ప్రస్తుతం ఏమీ మాట్లాడలేను. ఆ విభాగం ఇచ్చే సూచనల్ని బోర్డు సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు ఖన్నా పేర్కొన్నాడు.

తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్
మరోవైపు కేరళ క్రికెట్ అసోసియేషన్ ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేసింది. ‘శ్రీశాంత్కి మొదటి నుంచి అసోసియేషన్ మద్దతుగా నిలుస్తోంది. ఢిల్లీ పోలీసుల అరెస్టు, కోర్టు వ్యవహారాల్లో అతనికి తోడ్పాటునందించాం. శ్రీశాంత్ మళ్లీ కేరళ జెర్సీ ధరించి మ్యాచ్లు ఆడుతుంటే చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని అసోసియేషన్ సెక్రటరీ జయేష్ జియార్జ్ స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications