హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)లోని ఓ జట్టుకు మెంటార్గా వ్యవహరించడానికి అంగీకారం తెలిపారు. జులైలో టీఎన్పీఎల్ రెండో సీజన్ ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో వీబీ తిరువల్లూరు వీరన్స్ జట్టుకు ఇకపై ముత్తయ్య మెంటార్గా వ్యవహరించనున్నట్లు ఆ జట్టు యజమాని, మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ తెలిపారు. 'ముత్తయ్య మురళీధరన్ తిరువల్లూరు వీరన్స్ జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తారు. ఇదేమీ తాను ప్లాన్ చేయలేదని, ఊహించలేదు' అని అన్నారు.

ఎంతో అనుభవం ఉన్న ఆటగాడి సలహాలు, సూచనలు ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడతాయన్న నేపథ్యంలోనే మురళీధరన్ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. లీగ్ చివరి వరకు మురళీధరన్ ఆటగాళ్లకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు.
మెంటార్గా బాధ్యతలు స్వీకరించాలని అడగ్గానే ఒప్పుకున్న మురళీధరన్కు ఈ సందర్భంగా చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపాడు. ముత్తయ్య నుంచి జట్టులోని ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ముత్తయ్య సేవలం ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
2016లో టీఎన్పీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అరంగ్రేట సీజన్లో వీబీ తిరువల్లూరు వీరన్స్ జట్టు సెమీఫైనల్ బెర్తును తృటిలో చేజార్చుకుంది. ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్కు బౌలింగ్ కోచ్గా ఉన్న మురళీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్గా కూడా పనిచేశారు.