
కొలంబో: శ్రీలంక మాజీ ఆటగాడు, బౌలింగ్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ నార్త్ ప్రావిన్స్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నాడని సమాచారం తెలుస్తోంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మురళీధరన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి బాధ్యతలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారని డైలీ మిర్రర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో రాజపక్స లంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజపక్స ప్రభుత్వంలో మాజీ ఏస్ స్పిన్నర్ మురళీధరన్తో పాటు మరో ఇద్దరు గవర్నర్ బాధ్యతలు అందుకోనున్నారట. అనురాధ యహంపతి ఈస్ట్ ప్రావిన్స్, తిస్సా వితర్ణ నార్త్ సెంట్రల్ ప్రావిన్స్లకు గవర్నర్గా బాధ్యతలు స్వీకరిస్తారని రాష్ట్రపతి సచివాలయ వర్గాలు తెలిపాయి.
ముత్తయ్య మురళీధరన్ మాజీ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. అనురాధ యహంపతి నేషనలిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ మరియు వస్త్ర ఎగుమతి సంస్థ డైరెక్టర్. ఇక తిస్సా వితర్ణ మాజీ మంత్రి, లంక సమ సమాజ పార్టీ నాయకుడు. వితర్ణ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ పదవిలో చాలా కాలం పాటు ఉన్నారు. అంతేకాదు వైరల్ వ్యాధులపై స్పెషలిస్ట్ డాక్టర్ కూడా.
మురళీధరన్ బౌలింగ్లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.