
మురళీధరన్ భారీ విరాళం
శ్రీలంకలో కరోనా వైరస్ కట్టడి కోసం తన వంతు సాయంగా 5 మిలియన్లు (శ్రీలంక రూపాయలు) అక్కడి ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నట్లు ముత్తయ్య మురళీధరన్ ప్రకటించాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు 20 లక్షల 12 వేలు. ఈ కఠిన సమయంలో ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని మురళీధరన్ సూచించాడు. ప్రభుత్వం ఒక్కటే అన్నీ చూసుకోలేదని, మనకు చేతనైనంత సాయం చేయాలన్నాడు.

146 కేసులే నమోదు:
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మాదిరిగానే శ్రీలంక ప్రభుత్వం కూడా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించే నిర్ణయాన్ని ఇటీవల ప్రకటించింది. ప్రజలు ఇంటి లోపల ఉండి సామాజిక దూరం పాటించేలా చూడటం అతిపెద్ద సవాలుగా మారింది. భారత్తో పోలిస్తే లంకలో పరిస్థితి బాగానే ఉంది. ఇప్పటి వరకూ 146 కేసులే నమోదవగా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. పాజిటివ్ కేసులు తక్కువే అయినా.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించారు.

గొప్పగా పని చేస్తున్నారు:
'క్రికెట్ అభిమానులు, శ్రీలంక ప్రజలందరూ అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని కోరుతున్నాను. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లోనే ఉండండి. ఎలాంటి భయాందోళనలు వద్దు. వచ్చే వారం మరింత కీలకం కానుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్న విధానం గురించి నేను గర్వపడుతున్నా. ప్రభుత్వం, వైద్యులు, మిలటరీ మరియు ప్రభుత్వ ఉద్యోగులందరూ గొప్పగా పని చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చాలా కష్టపడుతున్నాయి. అందరం ఇంట్లో ఉండి మద్దతు ఇవ్వాలి' అని మురళీధరన్ కోరాడు.

పలు ప్రపంచ రికార్డులు బద్దలు:
బౌలింగ్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












