టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా తన పేరిట ఉన్న రికార్డు ఎప్పటికీ పదిలంగానే ఉంటుందని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. భవిష్యత్లో ఏ బౌలర్ తన రికార్డును బ్రేక్ చేయలేడని పేర్కొంటూ దానికి వివరణ ఇచ్చాడు. టెస్టు ఫార్మాట్లలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో ముత్తయ్య మురళీధన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604) టాప్-5లో ఉన్నారు.
టెస్టు క్రికెట్ పట్ల ఆందోళన చెందుతున్నాని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్లు ఎక్కువగా ఆడుతూ, టెస్టు క్రికెట్ తక్కువగా ఆడుతున్నారని పేర్కొన్నాడు. దీంతో తన రికార్డును బ్రేక్ చేయడం కష్టమని మురళీధరన్ తెలిపాడు. అంతేగాక ఆటగాళ్ల కెరీర్ కూడా కొంత కాలమే ఉండటం మరో కారణమని వివరించాడు.

''టెస్టు క్రికెట్ గురించి ఎంతో ఆందోళన చెందుతున్నా. ప్రతి దేశం ఏడాదికి ఆరు నుంచి ఏడు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు యాషెష్ కూడా ఆడుతున్నాయి. కానీ ఇతర దేశాల పరిస్థితి అలా కాదు. టెస్టు ఫార్మాట్ను చూసేవాళ్లు ఎక్కువగా లేరు. టెస్టు క్రికెట్ చాలా తక్కువగా ఉంది''
''800 వికెట్ల టెస్టు రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రాధాన్యత మారింది. అంతేగాక కెరీర్లు కూడా కొంత కాలమే కొనసాగుతున్నాయి. మేం 20 ఏళ్లు క్రికెట్ ఆడాం. ఇక ఆటలో నిలకడగా ప్రదర్శన చేయం కీలకం. మీరు ఎంత టాలెంటెడ్ అనేది ముఖ్యం కాదు. ఇక్కడ అందరూ నైపుణ్యం ఉన్నవాళ్లే. అలాగే అనుభవజ్ఞులుగా ఎలా మారతారనేది కూడా కీలకం. ప్రస్తుత ప్లేయర్ల మైండ్లో ఎన్నో టోర్నమెంట్ల గురించి ఆలోచనలు పరిగెత్తుతున్నాయి'' అని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు.
కాగా, ప్రస్తుత ఆటగాళ్లలో మురళీధరన్ 800 వికెట్లకు నాథన్ లైయన్ (530), రవిచంద్రన్ అశ్విన్ (516) కాస్త దగ్గరగా ఉన్నారు. అయితే 36 ఏళ్ల లైయన్, 37 ఏళ్ల అశ్విన్ ఈ రికార్డు వికెట్ల మార్క్ను అందుకోవడం దాదాపు అసాధ్యమే.