కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9లో రాయల్ ఛాలెంజర్స్ జట్టును రన్నరప్గా నిలబెట్టిన ఆ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై శ్రీలంక మాజీ స్పిన్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలతో ముంచెత్తాడు.
విరాట్కోహ్లీ ఫామ్ను చూస్తోంటే ఈ దశలో అంతర్జాతీయ క్రికెట్లోనూ అతడినెవరూ ఆపలేరని మురళీధరన్ అన్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత భీకర ఫామ్తో గత రెండేళ్లుగా టీమిండియా, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శనలతో కోహ్లీ పరుగుల యంత్రంగా మారాడని కితాబిచ్చాడు.
'విజన్ 2020' కార్యక్రమాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) చేపట్టింది. రాష్ట్రం నుంచి ప్రతిభ గల ఆటగాళ్లను తయారు చేసి టీమిండియాకు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందుకోసం పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వకార్ యూనిస్, ముత్తయ్య మురళీధరన్లను క్యాబ్ నియమించుకుంది.
ఈ నేపథ్యంలో బెంగాల్ ఆటగాళ్లకు సరైన నిర్దేశం చేసేందుకు ముత్తయ్య మురళీధరన్ కోల్కతాకు వచ్చాడు. రెండురోజులుగా ఇక్కడే మకాం వేసిన ఈ స్పిన్నర్ మీడియాతో కాసేపు మాట్లాడాడు. బెంగాల్ రాష్ట్రంలో చాలా మంది ప్రతిభ గల స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు.
ఇక ఐపిఎల్ గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్-9 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచిందన్నాడు. అయితే కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసొచ్చిందని పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ తన కెప్టెన్సీతో, బ్యాటింగ్ ఫామ్తో జట్టును ముందుండి నడిపించాడని కొనియాడాడు.
ఇక ముస్తాఫిజుర్ రెహ్మాన్ అయితే ఈ తరంలో అద్భుత బౌలర్గా రూపొందుతాడని ప్రశంసించాడు. అతడు మరింత రాటుదేలేందుకు విదేశీ టోర్నీలో ఎక్కువగా ఆడాలని సూచించాడు.
ప్రస్తుత శ్రీలంక జట్టు ఫామ్ పట్ల తనకేమీ బాధలేదన్నాడు. గత రెండు దశాబ్దాలుగా సేవలందించిన క్రికెటర్లు రిటైర్ కావడంతో జట్టులో యువరక్తం మాత్రమే మిగిలిందన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో వారు నిలకడగా రాణించేందుకు కాస్త సమయం పడుతుందని మురళీధరన్ తెలిపాడు.