ఐపీఎల్ 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో నెలకొన్న నిరసనల కారణంగా ఆ దేశ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. మినీ వేలంలో కేకేఆర్ ఏకంగా రూ.9.20 కోట్లు వెచ్చించి ముస్తాఫిజుర్ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ముస్తాఫిజుర్ దూరం కావడంతో, అతని స్థానంలో వచ్చే ముగ్గురు కీలక ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముస్తాఫిజుర్ స్థానంలో కేకేఆర్ రేసులో ఉన్న ముగ్గురు ప్లేయర్లు వీరే..
కేకేఆర్ యాజమాన్యం ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రధానంగా ముగ్గురు బౌలర్ల వైపు చూస్తోంది.
1. ఉమేష్ యాదవ్
ఒకవేళ కేకేఆర్ భారతీయ అనుభవం ఉన్న బౌలర్ కావాలని అనుకుంటే ఉమేష్ యాదవ్ మొదటి ఛాయిస్. గతంలో కేకేఆర్ తరపున ఆడిన అనుభవం ఉమేష్కు ఉంది. 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 సీజన్లో కేకేఆర్ తరపున 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. మినీ వేలంలో ఉమేష్ యాదవ్ బేస్ ప్రైస్ రూ. 1.50 కోట్లు.

2. స్పెన్సర్ జాన్సన్
ముస్తాఫిజుర్ వలె ఎడమచేతి వాటం పేసర్ కావాలని కేకేఆర్ భావిస్తే, ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్ సరైన ఎంపిక. 2025 వేలంలో కేకేఆర్ ఇతడిని రూ.2.80 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం గాయం కారణంగా దూరంగా ఉన్నా.. ఐపీఎల్ సమయానికి కోలుకుంటే కేకేఆర్ ఇతనికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
3. అల్జారీ జోసెఫ్
కేకేఆర్ మెంటర్ డ్వేన్ బ్రావోకు వెస్టిండీస్ ఆటగాళ్లపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో అల్జారీ జోసెఫ్ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్ (6/12) నమోదు చేసిన రికార్డు జోసెఫ్ పేరు మీద ఉంది. బ్రావో సిఫార్సు మేరకు అత్యంత వేగంగా బంతులు విసిరే అల్జారీ జోసెఫ్ కేకేఆర్ క్యాంప్లోకి వచ్చే వీలుంది.
బీసీసీఐ నిర్ణయానికి కారణం ఏమిటి?
బంగ్లాదేశ్లో మైనారిటీలపై (హిందువులపై) దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగా కూడా ఒత్తిడి పెరగడంతో, బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో కొనసాగించడంపై బీసీసీఐ పునరాలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ చెల్లించిన రూ. 9.20 కోట్లు తిరిగి వారికి లభిస్తాయని ఆ మొత్తంతో కొత్త ప్లేయర్ను ఎంచుకోవచ్చని సమాచారం.