బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ముస్తాఫిజుర్ను జట్టు నుంచి తప్పించింది.ఐపీఎల్ 2026 సీజన్కు ముందే కోల్కతా నైట్ రైడర్స్ తనను జట్టు నుంచి విడుదల చేయడంపై బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలిసారి మౌనం వీడాడు. జట్టు నుంచి తొలగింపుపై ముస్తాఫిజుర్ స్పందిస్తూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఏమన్నారంటే?
జట్టు నుంచి విడుదల చేయడంపై బంగ్లాదేశ్ మీడియాతో ముస్తాఫిజుర్ మాట్లాడుతూ.. "నన్ను జట్టు నుంచి విడుదల చేస్తే నేను మాత్రం ఏం చేయగలను?" అని నిస్సహాయంగా ప్రశ్నించారు. ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ తనపై చూపించిన నమ్మకాన్ని గౌరవిస్తానని.. అయితే బోర్డు నిర్ణయం ముందు ఎవరూ ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. తానూ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే కేవలం రాజకీయ కారణాల వల్ల జట్టుకు దూరం కావడం పట్ల ఆయన తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

అసలు వివాదం ఏంటి?
గత వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్ రూ.9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లా ఆటగాడిగా అతను నిలిచాడు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల వార్తలు రావడంతో, భారత్లో బంగ్లా ఆటగాళ్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్త నిరసనలు, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని, ముస్తాఫిజుర్ను తక్షణమే స్క్వాడ్ నుంచి విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కేకేఆర్ను ఆదేశించారు.
కేకేఆర్, బంగ్లాదేశ్ స్పందన
బీసీసీఐ ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని, ఇప్పటికే విడుదల ప్రక్రియను పూర్తి చేశామని కేకేఆర్ ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా మరో విదేశీ ఆటగాడిని తీసుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. ముస్తాఫిజుర్ తొలగింపుపై బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీవ్రంగా స్పందించారు. ఇది తమ ఆటగాళ్లను అవమానించడమేనని, ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్లో నిలిపివేయాలని ఆయన సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తమ ఆటగాళ్లకు భారత్లో భద్రత లేదని భావిస్తే, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) హెచ్చరించింది.