హైదరాబాద్: కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన అనంతరం మహేంద్ర సింగ్ ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ధోని తన కుమార్తెతో కలిసి ఉన్న ఓ వీడియోని తన ఇనిస్టాగ్రాం ఖాతాలో పోస్టు చేశాడు.
ఆ వీడియోలో ధోని 2 ఏళ్ల కుమార్తె జీవా పింక్ డ్రస్సులో గడ్డిలో నేలపై పాకుతూ కనిపిస్తుండగా, ధోని కూడా ఫాలో అవుతూ కనిపించాడు. ఈ క్రమంలో జీవా తన తండ్రిని వెనక్కి తిరిగి చూడటం ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముందుకు వెళుతూ ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియోని ధోని తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 1200 సార్లు రీట్వీట్ అవగా, 5,500 మంది లైక్ చేశారు. మంగళవారం దీనిపై ఆర్టికల్ రాసే సమయానికి దీనిని 6 లక్షల మందికి పైగా వీక్షించారు.
35 ఏళ్ల ధోని అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని ఆడనున్నాడు. మరోవైపు ఏప్రిల్ 5 నుంచి జరిగే ఐపీఎల్లో రైజింగ్ పూణె సూపర్ గెయింట్స్కు కెప్టెన్గా వ్వవహరిస్తున్నాడు.