
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మే నెలకు గాను 'ప్లేయర్స్ ఆఫ్ ద మంత్' అవార్డులను సోమవారం ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో బంగ్లాదేశ్ వెటరన్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్కు ఈ అవార్డు దక్కగా.. వుమెన్స్ క్రికెట్లో స్కాట్లాండ్ ఆల్రౌండర్ కాథరిన్ బ్రైస్కు దక్కింది. ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్నవిషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన పురుష, మహిళల ప్లేయర్స్కు ఈ అవార్డు దక్కుతుంది.
ముష్ఫికర్ రహీమ్ ఇటీవల సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు సాధించాడు. మూడు మ్యాచ్ల్లో 237 పరుగులు చేశాడు. రెండో వన్డేలో సెంచరీ (125) చేశాడు. దీంతో తొలిసారి శ్రీలంకపై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ (2-0) గెలిచింది. 15 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తర్వాత కూడా ముష్ఫికర్ రహీమ్ పరుగుల దాహం తీరలేదని, అతని ఫిట్నెస్ మరియు నైపుణ్యాలు బాగున్నాయని ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యుడైన టీమిండియా మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. బంగ్లా తరఫున 74 టెస్టులు, 227 వన్డేలు, 86 టీ20 మ్యాచ్లు ఆడాడు. పంత్, అశ్విన్, భువనేశ్వర్, బాబర్, రహీమ్ మెన్స్ క్రికెట్లో వరుసగా అవార్డులు అందుకున్నారు.
స్కాట్లాండ్ మహిళ క్రికెటర్ కేథరిన్ బ్రైస్ ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచింది. స్కాట్లాండ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ కేథరినే కావడం విశేషం. పురుషుల విభాగంలో కూడా ఇప్పటివరకు ఒక్కరు కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఐర్లాండ్తో జరిగిన నాలుగు మ్యాచుల టీ20 సిరీస్లో 96 పరుగులతో పాటు 5 వికెట్లు తీసింది. దీంతో ర్యాంకింగ్స్లో తొమ్మిది స్థానాలు ఎగబాకింది. బ్రైస్ స్కాట్లాండ్ తరఫున 18 టీ20లు ఆడింది.
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు సంబంధించిన సభ్యులు ఉంటారు.