అండర్-19 ప్రపంచకప్లో భారత యువ జట్టు విజయాలతో హోరెత్తిస్తోంది. మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 214 పరుగుల తేడాతో నెగ్గి టీమిండియా దాదాపు సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అయితే కివీస్ పోరులో ముషీర్ ఖాన్ ఆడిన హెలికాఫ్టర్ షాట్ నెట్టింట్లో వైరల్గా మారింది. ధోనీ స్టైల్లో సిక్సర్ బాది ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇటీవల టీమిండియా జట్టులో చోటు సంపాదించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. కాగా, అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ సాధించిన విజయాల్లో ముషీర్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు, న్యూజిలాండ్పై 126 బంతుల్లో 131 పరుగులు సాధించాడు. టీమిండియా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. అయితే కివీస్పై అతడు ఆడిన ఓ షాట్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మసోన్ క్లార్క్ వేసిన బంతిని హెలికాఫ్టర్ షాట్తో స్టాండ్స్లోకి తరలించాడు. దీంతో ధోనీని గుర్తుకు తెచ్చావంటూ నెటిజన్లు అతడి టాలెంట్కు ఫిదా అయ్యారు.

కాగా, న్యూజిలాండ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 295 పరుగులు సాధించింది. ముషీర్ ఖాన్ (131; 126 బంతుల్లో) శతకంతో కదం తొక్కగా ఆదర్శ్ సింగ్ (52; 58 బంతుల్లో), ఉదయ్ (34; 57 బంతుల్లో), అరవెల్లి అవనీశ్ (17; 18 బంతుల్లో) పరుగులు చేశారు. అయితే ఆదిలోనే భారత్ వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వద్ద అర్షిన్ కులకర్ణి (9; 9 బంతుల్లో) ఔటయ్యాడు. ఈ దశలో వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ముషీర్ ఖాన్ 48 ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. కివీస్ బౌలర్లలో మసోన్ క్లార్క్ నాలుగు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిలలాడింది. తొలి ఓవర్లోనే రాజ్ లింబాని రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఖాతా తెరవకముందే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కివీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. సౌమి పాండే చెలరేగాడు. 10 ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. రాజ్ లింబాని రెండు, ముషీర్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటారు. నమన్ తివారి, అర్షిన్ కులకర్ణి చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (19; 38 బంతుల్లో) టాప్ స్కోరర్.