టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు యువ సంచలనం ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇరానీ కప్ కోసం లక్నోకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అతని మెడకు తీవ్ర గాయాలయ్యాయి. అతను కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ప్రమాద సమయంలో ముషీర్ ఖాన్తో పాటు అతని తండ్రి నౌషద్ ఖాన్ కూడా ఉన్నారు.
తన సొంత ఊరైన అజామ్ఘడ్ నుంచి ముషీర్ ఖాన్ కాన్పూర్కు వెళ్తుండగా, పూర్వంచల్ ఎక్స్ప్రెస్ వేలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. నౌషద్ ఖాన్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. వారిద్దరిని లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన అనంతరం మేదాంత మెడికల్ సూపరింటెండెంట్ డా. భోలా సింగ్ ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదుల చేశారు.

ముషీర్ ఖాన్కు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. ప్రస్తుతం స్పృహతోనే ఉన్నాడని, అయితే ప్రయాణం చేసేంత కోలుకున్న తర్వాత ముంబై ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ''పూర్వంచల్ ఎక్స్ప్రెస్ వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ ముషీర్ ఖాన్ గాయపడ్డాడు. మెడనొప్పితో బాధపడుతున్న అతన్ని మేదాంత ఎమెర్జెన్సీ విభాగానికి తీసుకువచ్చారు. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ధర్మేందర్ సింగ్ ముషీర్ ఖాన్కు చికిత్స చేశారు''
''ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. ఎలాంటి ప్రాణాపాయం లేదు. అతని మెడ భాగంలో ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోషియేషన్ మెడికల్స్ టీమ్ ముషీర్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రయాణానికి సరిపోయేంతగా ముషీర్ ఫిట్ సాధిస్తే, మెరుగైన చికిత్స కోసం ముంబైకు తరలిస్తారు'' అని ప్రకటన విడుదల చేశారు.
లక్నో వేదికగా అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ జరగనున్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ విజేత ముంబైతో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ముంబై జట్టులో కీలక ప్లేయర్ అయిన 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ఇరానీ కప్ కోసం సిద్ధమయ్యాడు. అయితే లక్నోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇరానీ కప్తో పాటు అక్టోబర్ 11 నుంచి జరిగే రంజీ ట్రోఫీ ప్రారంభ రౌండ్లకు కూడా ముషీర్ ఖాన్ దూరం కానున్నాడు.
ముషీర్ ఖాన్ తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లోనే స్టార్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున 181 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీలో ముంబై విజేతగా నిలవడంలో ముషీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అజేయంగా 203 పరుగులు సాధించాడు. విదర్భతో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ (136)తో చెలరేగాడు. ఇండియా-ఏ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ముషీర్ ఖాన్ ఎంపిక దాదాపు ఖరారు కూడా అయ్యింది.