Virat Kohli: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఎంతో అగ్రిగెసివ్గా కనిపించిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరాతో దూకుడుగా ప్రవర్తిస్తూ చర్చనీయాంశమయ్యాడు. అయితే ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ కు చెందిన ఓ యంగ్ ప్లేయర్ విషయంలో తన మంచి మనసు కూడా చాటుకున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఈ విషయం ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ విరాట్ ఏం చేశాడంటే?
ఈ మ్యాచ్ మహారాజా యదవీంద్రా సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ గేమ్ లో దేవ్దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి విరాట్ కోహ్లీ (73*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో.. ఆర్సీబీకీ ఈ సీజన్ లో బయటి స్టేడియాల్లో వరుసగా ఐదో విజయం దక్కింది.

ఏడ్చేశాను...
అయితే ఈ మ్యాచ్ విజయం అనంతరం పంజాబ్ కింగ్స్ యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్.. విరాట్ కోహ్లీ చేసిన పని గురించి బయట పెట్టాడు. "నేను విరాట్ భయ్యా ముందు భావోద్వేగానికి గుర్యయాను. ఎంతో ఏడ్చాను. 'మీ బ్యాటుతో ఎన్నో పరుగులు సాధించాను, సర్ఫరాజ్ అన్నయ్య మీ బ్యాటును ఉపయోగించుకునేందుకు నాకిచ్చాడు. దాంతో చాలా పరుగులు చేశాను' అని చెప్పాను. విరాట్ భయ్యా మీ దగ్గరున్న బ్యాట్లలో ఒకటి ఇవ్వండి ప్లీజ్. అది విరిగిపోయింది అయినా పర్లేదు. కేవలం ఒక బ్యాట్ ఇవ్వండి." అని అడిగాను.
విరాట్ అంటే పిచ్చి..
ఆ తర్వాత విరాట్ కోహ్లీ తనకు ఇచ్చిన బ్యాట్ ను టీమ్ మేట్స్ కు చూపిస్తూ ఎంతో సంతోషపడిపోయాడు ముషీర్ ఖాన్. విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు. విరాట్ అంతే తనకు చెప్పలేనంత అభిమానమని.. మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ముషీర్ ఖాన్ ను మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ లో అతడు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.