
హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కేఎల్ రాహుల్కి ఓపెనర్గా అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరిస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు.
దీంతో బర్మింగ్హామ్ వేదికగా జరిగే తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మీరైతే ఎవర్ని ఓపెనర్లుగా పంపిస్తారు? అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా మురళీ విజయ్, కేఎల్ రాహుల్లను ఓపెనర్లుగా పంపుతానని అన్నారు.
"టెస్టు సిరీస్లో నేనైతే మురళీ విజయ్, కేఎల్ రాహుల్ని ఎంచుకుంటా. శిఖర్ ధావన్ కూడా వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లోనూ మంచి టచ్లో కనిపించాడు. కానీ, టెస్టుల్లో విదేశీ గడ్డపై అతనికి మంచి రికార్డు లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పిచ్లపై టెస్టుల్లో అతను తడబడుతున్నాడు" అని గంగూలీ పేర్కొన్నారు.
"ఇక, బెంగళూరు వేదికగా అప్ఘనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో లంచ్లోపే ధావన్ సెంచరీని నమోదు చేశాడు. ఏది ఏమైనా తుది జట్టు నిర్ణయం పూర్తిగా టీమిండియా మేనేజ్మెంట్దే. ఎవరిని ఓపెనర్లుగా పంపిస్తారో చూడాలి" అని గంగూలీ తెలిపారు. కాగా, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 1న జరగనుంది.
ఇంగ్లండ్ గడ్డపై కఠినమైన టెస్టు సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇంగ్లీష్ టీమ్పై 11 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆతిధ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.
గత కొంతకాలంగా టెస్టుల్లో ఓటమంటూ లేకుండా ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా.. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై చిత్తు చేయాలని ఉవ్విల్లూరుతోంది. మరోవైపు, జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు చరిత్రను పునరావృతం చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది.