|
తొలి ఇన్నింగ్స్లో మురళీ విజయ్ చక్కటి ప్రదర్శన
గాయం నుంచి కోలుకోవడంతో మూడో టెస్టులో చోటు దక్కించుకున్న విజయ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. టెస్టుల్లో మురళీ విజయ్కి ఇది 15వ అర్ధ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ సాధించిన తర్వాత అతని కెరీర్లో యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఆస్ట్రేలియాపైనే సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఆస్ట్రేలియాపై పది సార్లు యాభైకు పైగా పరుగులు
తన టెస్టు కెరీర్లో ఆస్ట్రేలియాపై పది సార్లు యాభైకు పైగా పరుగులను మురళీ విజయ్ నమోదు చేశాడు. తద్వారా ఆస్ట్రేలియాపై ఎక్కువ సార్లు యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని సాధించిన అరుదైన గుర్తింపుని మురళీ విజయ్ సొంతం చేసుకున్నాడు. మిగతా ఏ జట్టుపైనా కూడా యాభైకు పైగా స్కోర్లను ఐదుసార్లకు మించి చేయక పోవడం విశేషం.
లంచ్ విరామానికి టీమిండియా 193/2
120/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు మురళీ విజయ్ రూపంలో వికెట్ను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ అర్ధసెంచరీ అనంతరం ఓకీఫ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
పది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు చేసిన విజయ్
183 బంతులను ఎదుర్కొన్న విజయ్ పది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో 193 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను కోల్పోయింది. వీరిద్దరూ రెండో వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు పుజారా ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. పుజారా 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
మురళీ విజయ్ ఖాతాలో మరో చెత్త రికార్డు
రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో మురళీ విజయ్ 82 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. అయితే విజయ్ అవుటైన క్రమంలో అతని ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. ఇప్పటి వరకు విజయ్ ఆడిన టెస్టుల్లో సెషన్ ప్రారంభంలోగానీ, ముగింపునకు ముందుగానీ అవుటవడం ఇది 12వ సారి. ఇలా అవుటైన వారిలో అందరికంటే మురళీ విజయ్ ముందున్నాడు. మూడో రోజు మొదటి సెషన్ పూర్తవడానికి ముందు విజయ్ భారీ షాట్కు యత్నించి స్టంపౌట్ అయ్యాడు.