
హైదరాబాద్: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో చరిత్ర సృష్టించాడు. ఈ రోజు వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20లో మున్రో శతకం సాధించి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో మూడోసారి శతకం నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన గప్తిల్- మన్రో వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 11.3 వద్ద గప్తిల్(63) ఔటయ్యాడు. అయినప్పటికీ మున్రో తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడాడు.
16.1వ ఓవర్లో నర్స్ వేసిన బంతికి సింగిల్ తీసిన మున్రో శతకం పూర్తి చేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్ మూడు శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 19.1వ ఓవర్లో బ్రాత్వైట్ వేసిన బంతికి మున్రో (104; 88 బంతుల్లో; పది సిక్స్లు, మూడు ఫోర్లు) హెట్మర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
నిర్ణీత ఓవర్లలో కివీస్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అనంతరం మరో ఓపెనర్ వాల్టన్ కూడా అంతే. ఫ్లెచర్(46) కాస్త పోరాడినా అతనికి ఎవరూ అండగా నిలవలేకపోయారు. సౌథీ, సోథీ, బౌల్ట్ ధాటికి వెస్టిండీస్ 124 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో మూడు మ్యాచుల సిరీస్ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది.
రెండో టీ20 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. శతకంతో అదరగొట్టిన మున్రో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ను దక్కించుకున్నాడు. 2018లో తొలి ఫోర్, తొలి సిక్స్, తొలి శతకం సాధించిన ఆటగాడిగా మున్రో నిలిచాడు. తాజా సిరీస్ విజయంతో కివీస్ టీ20 ర్యాంకింగ్స్లో 124 పాయింట్లతో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్(124), భారత్(121) ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.