
1999-2000 సీజన్ నాకు ఎంతో ప్రత్యేకమైంది
‘ఇప్పటివరకు 47 శాతం మ్యాచ్లను గెలిచాం. ఈ విజయాలను చూస్తే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ముఖ్యంగా 1999-2000 సీజన్ నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఎప్పటికీ మరిచిపోలేను. రంజీ ట్రోఫీలో భాగంగా సెమీఫైనల్లో తమిళనాడుతో మా జట్టు తలపడింది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగింది. తొలి ఇన్నింగ్స్లో ముంబై 485 పరుగులు చేసింది' అని సచిన్ అన్నాడు.

డబుల్ సెంచరీ సాధించాను
'ఈ మ్యాచ్లో నేను డబుల్ సెంచరీ సాధించాను. ఈ మ్యాచ్లో మంబై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పుడు తమిళనాడు జట్టుకు హేమంగ్ బదానీ కెప్టెన్గా ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేసే సమయంలో క్రీజు వెలుపల నుంచున్నట్లు గుర్తించిన బదానీ బౌలర్కు తమిళ్లో ఎలా బౌలింగ్ చేయాలో సలహా ఇచ్చాడు' అని సచిన్ తెలిపాడు.

బదానీ వద్దకు వెళ్లి నాకు తమిళం వచ్చు అని చెప్పా
'బౌలింగ్ వేసేందుకు బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి నేను క్రీజు లోపలికి వచ్చేశాను. మ్యాచ్ అనంతరం బదానీ వద్దకు వెళ్లి నాకు తమిళం వచ్చు అని చెప్పాను. దీంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు' అని సచిన్ వివరించాడు. ఇదే విషయాన్ని సచిన్ ఇటీవల ‘డెమోక్రసీ ఎలెవన్' పుస్తకం ఆవిష్కరణ సందర్భంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

రంజీల్లో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబై
ఇప్పటివరకు ముంబై రంజీల్లో 41 సార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. విజయ్ మర్చంట్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 499 మ్యాచ్లలో ముంబై 242 గెలిచి 26 ఓడింది. మరో 231 మ్యాచ్లు ‘డ్రా' చేసుకుంది. అంతేకాదు భారత జట్టుకు అత్యధిక మంది క్రికెటర్లను అందించిన ఘనత కూడా ముంబైదే.


Click it and Unblock the Notifications











