ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితా
మెగా వేలానికి ముందు నిబంధనలకు అనుగుణంగా ఈ సారి ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ముంబై రిటెన్షన్ జాబితాలో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. హిట్మ్యాన్తోపాటు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ను తమ ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ జాబితాలో చేర్చింది. ఇక మిగతా వారిని ఆ జట్టు వేలంలో కొనుగోలు చేయనుంది.
ముగ్గురు ఆల్రౌండర్లపై కన్ను
ఈ క్రమంలోనే మెగా వేలంలో ముగ్గురు ఆల్రౌండర్లపై ముంబై ఇండియన్స్ కన్నేసింది. వారిలో ఇద్దరు ఇండియాకు చెందిన శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ కాగా, మరొకరు వెస్టిండీస్కు చెందిన జేసన్ హోల్డర్. ఈ ముగ్గురు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నారు. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టూర్లో భారత ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ రాణించారు. ఇక వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టాడు. దీంతో ఈ ముగ్గురిని ఈ సారి వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.
ధర ఎంతంటే?
గతేడాది శార్దూల్ ఠూకూర్, దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఈ సారి వేలంలోకి వచ్చారు. అలాగే గతేడాది సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు కూడా ఈ
సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో హోల్డర్ సైతం వేలంలో ఉండున్నాడు. దీంతో ఈ ముగ్గురిని వేలంలో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 20 నుంచి 28 కోట్ల రూపాయలు వెచ్చించి కోనుగోలు చేయాలని చూస్తోందని సమాచారం. ముంబై వ్యూహాలు ఫలించి వీరు ముగ్గురిని వేలంలో కొనుగోలు చేస్తే ఇక ఈ లీగ్లో ఆ జట్టుకు తిరుగుండక పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
రికార్డులు
ఐపీఎల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్లు ఆడిన హోల్డర్ 189 పరుగులు చేసి 35 వికెట్లు తీశాడు. హోల్డర్కు అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటర్గానూ మంచి రికార్డులు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు దీపక్ చాహర్ 63 మ్యాచ్లు ఆడి 59 వికెట్లు తీశాడు. చాహర్కు బ్యాటర్గా, బౌలర్గా అంతర్జాతీయ క్రికెట్లో మంచి రికార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ 61 మ్యాచ్ల్లో 67 వికెట్లు తీశాడు. ఠాకూర్కు కూడా అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటర్గా, బౌలర్గా మంచి రికార్డులు ఉన్నాయి.