న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఆ జట్టు సాధించిన తొలి విజయం ఇదే. తొలి రెండు మ్యాచ్లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్పై ఓడిన అనంతరం ఈ విజయాన్ని అందుకుంది.
పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆదివారం తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది ముంబై ఇండియన్స్. కోల్కత నైట్ రైడర్స్ను ఢీ కొట్టబోతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

ముంబై ఇండియన్స్తో పోల్చుకుంటే కేకేఆర్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లను ఆడిన కోల్కత నైట్ రైడర్స్.. రెండింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం కేకేఆర్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ ఈ రెండు జట్లకు అత్యంత కీలకమే. ఓడిన జట్లు పరిస్థితి మరింత దిగజారుతుంది.
మున్ముందు మ్యాచ్లను గెలిచి తీరాల్సిన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో- ముంబై ఇండియన్స్, కోల్కత నైట్ రైడర్స్ వాంఖెడే స్టేడియంలో ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. కాగా- ఈ మ్యాచ్ను ముంబై ఇండియన్స్.. బాలికలకు అంకితం చేయనుంది. స్పోర్ట్స్లో బాలికలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
దీనితో పాటు- 19,000 మంది బాలికలను స్టేడియానికి తీసుకెళ్లనుంది. వారికి ఉచితంగా మ్యాచ్ను తిలకించే అరుదైన అవకాశాన్ని కలిగించనుంది. దీనికోసం వాంఖెడే స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది కూడా. అదే కాకుండా- ఈ మ్యాచ్కు హర్మన్ ప్రీత్ కౌర్.. చీఫ్ గెస్ట్గా అటెండ్ కాబోతోడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోహిత్ శర్మతో కలిసి ఆమె టాస్ వేయనున్నారు.
టాస్ వేయడానికి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్.. గ్రౌండ్లోకి అడుగు పెట్టనున్నారు. టాస్ కాయిన్ను హర్మన్ ప్రీత్ గాల్లోకి ఎగరేస్తారని తెలుస్తోంది. దేశంలో క్రికెట్లో మాత్రమే కాకుండా అన్ని రకాల క్రీడల్లో బాలికలకు ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ తెలిపింది.