ముంబయి ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మను కాదని, హార్దిక్ పాండ్యను కెప్టెన్గా నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ను ముంబయి బదిలీ చేసుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ తిరిగి ముంబయి గూటికి చేరడంపై చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత రెండు సీజన్లలో గుజరాత్ జట్టును హార్దిక్ గొప్పగా నడిపించాడు. సక్సెఫుల్ కెప్టెన్గా రెండు సార్లు ఫైనల్కు చేర్చడమేగాక 2022 సీజన్లో విజేతగా నిలిపాడు.
మరోవైపు రోహిత్ శర్మ 2013 నుంచి ముంబయి ఇండియన్స్కు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయిదు టైటిళ్లను సాధించి గొప్ప నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో అతడి విజయవంతమైన కెప్టెన్సీని మెచ్చి సెలక్టర్లు కూడా టీమిండియా పగ్గాలు హిట్మ్యాన్కే అప్పగించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రోహిత్ను కాదని హార్దిక్కు బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

భవిష్యత్తులో ఎప్పటికైనా ముంబయికి హార్దిక్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ 2024 సీజన్ నుంచే రోహిత్ను కాదని హార్దిక్ను ఎంచుకోవడమే షాకింగ్. ఈ నిర్ణయం వెనుక రోహిత్ ఐపీఎల్కు గుడ్ బై చెప్పే అవకాశాలు కూడా ఉంటాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అయితే ముంబయి హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేలా జయవర్ధనె కెప్టెన్సీ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. '' భవిష్యత్కు ముంబయిని సిద్ధం చేయడంలో ఇది భాగం. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ సింగ్ వరకు, అలాగే రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి జట్టు గొప్పగా రాణించింది. వారంతా ముంబయి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే సిద్ధాంతంతో 2024 సీజన్కు హార్దిక్ పాండ్య కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు''
''రోహిత్ శర్మ అసాధారణమైన కెప్టెన్సీకి ధన్యవాదాలు. 2013 నుండి ముంబయికి సారథిగా గొప్పగా బాధ్యతలు నిర్వర్తించాడు. అద్భుత విజయాలు అందించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అతడి కెప్టెన్సీలో మోస్ట్ సక్సెఫుల్ టీమ్స్ లో ఒకటిగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఇప్పుడు ముంబయిను మరింత బలోపేతం చేయడానికి రోహిత్ గైడెన్స్, అనుభవం మైదానం లోపల, వెలుపల ఉంటుందని భావిస్తున్నాం. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యకు శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్'' అని జయవర్ధనె అన్నాడు.