
మహిళల ప్రీమియర్ లీగ్లో హేమాహేమీల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమెరుగని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు రెండూ తలపడితే ఆ మ్యాచ్ మరో రేంజ్లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ముందు భారీ లక్ష్యం ఉంచాలనేది ఆ జట్టు ప్లాన్. కానీ ముంబై బౌలర్ల ముందు ఈ ప్లాన్ బెడిసికొట్టింది.
మెగ్ లానింగ్ (43), జెమీమా రోడ్రిగెజ్ (25), రాధా యాదవ్ (10) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చెయ్యలేదంటేనే.. ఢిల్లీ బ్యాటింగ్ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. షెఫాలీ అవుటైన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న అలైస్ క్యాప్సీ (6), మారిజానే కాప్ (2) దారుణంగా ఫెయిలయ్యారు. జెమీమా కాసేపు జాగ్రత్తగా ఆడింది. కానీ ఆమె అవుటైన తర్వాత వచ్చిన జెస్ జోనాసెన్ (2), తానియా భాటియా (4), మిన్ను మణి (0), టారా నోరిస్ (0), శిఖా పాండే (4 నాటౌట్) ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆ జట్టు 18 ఓవర్లు 105 పరుగులు చేసిన ఢిల్లీ ఆలౌట్ అయింది.
ఛేజింగ్లో ముంబై ఇండియన్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. వరుసగా విఫలం అవుతూ వస్తున్న ముంబై ఓపెనర్ యాస్తికా భాటియా (41) ఈ మ్యాచ్లో సత్తా చాటింది. మిగతా ముంబై బ్యాటర్లు హేలీ మాథ్యూస్ (32), నాట్ సివర్ బ్రంట్ (23 నాటౌట్), హర్మన్ప్రీత్ కౌర్ (11 నాటౌట్) అందరూ రాణించారు. దీంతో ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది. ఈ విజయంతో వరుసగా మూడు మ్యాచులు నెగ్గిన ముంబై.. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ టీం మరొక మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.