
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు.
పీయూస్ చావ్లా వేసిన 9వ ఓవర్ ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్ రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో ఈ సీజన్లో 400లకు పైగా పరుగులు సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న యాదవ్ ఇప్పటికే 415 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో 2008 సీజన్లో 616 పరుగులు చేసిన షాన్ మార్ష్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఐపీఎల్ 11వ సీజన్లో ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (62: 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
మ్యాచ్ ఆరంభంలోనే ఓపెన్ ఎవిన్ లూవిస్(18) వికెట్ తీసిన కోల్కతా, ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (36) పవర్ ప్లేలో దూకుడుగా ఆడగా, మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (36), హార్దిక్ పాండ్యా (19: 13 బంతుల్లో 2 సిక్సులు) రాణించారు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వరుసగా 6, 6, 6, 6 బాదిన ఇషాన్ కిషన్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో బెన్ కటింగ్ (24: 8 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులు) సిక్సర్ల మోత మోగించాడు. చావ్లా వేసిన ఆఖరి ఓవర్లో ముంబై 22 పరుగుల్ని పిండుకున్నాడు.
చావ్లా బౌలింగ్లో బెన్ కటింగ్ తొలి మూడు బంతుల్ని 6, 6, 4గా మలచగా.. ఆఖరి బంతిని కృనాల్ పాండ్యా సిక్స్గా మలిచాడు. దీంతో కోల్కతా నైట్రైడర్స్కు 211 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్కతా బౌలర్లలో పియూష్ చావ్లా 3 వికెట్లు తీసుకోగా... ప్రసాద్ కృష్ణన్, టామ్ కరాన్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు.