ముంబై: వాంఖేడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ పైన 25 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 187 పరుగులు చేసింది. 188 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.
ఆ సమయంలో... పదకొండో ఓవర్లో హర్భజన్ సింగ్ వరుసగా రైనా, ధోనీలను అవుట్ చేసి మ్యాచ్ను ముంబై వైపు తిప్పాడు. ముంబైలో మలింగ (3 వికెట్లు), మెక్లెనగన్ (1), వినయ్ కుమార్ (2), భజ్జీ (2), సుచిత్ (1) వికెట్ తీశారు. దీంతో చెన్నై 19 ఓవర్లకు 162 పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో ముంబై ఫైనల్కు దూసుకెళ్లింది. చెన్నై సూపర్ చెన్నై తరఫున డుప్లెసిస్ (34 బంతుల్లో 45), రైనా (20 బంతుల్లో 25) రాణించినా ఫలితం లేకపోయింది. ముంబై ఇన్నింగ్సులో సిమన్స్ (51 బంతుల్లో 65) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కీరన్ పొలార్డ్ (17 బంతుల్లో 41), పార్థివ్ (25 బంతుల్లో 35) రాణించారు. పొలార్డ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
పదో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన భజ్జీ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు. భజ్జీ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చిన రైనా పెవిలియన్కు చేరుకోగా ఆ మరుసటి బంతికే ధోనీ వికెట్ల ముందు దొరికిపోయాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి డ్వేన్ బ్రావో ఇచ్చిన సులువైన క్యాచ్ను భజ్జీ వదిలేయడంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది.
అప్పటికి చెన్నై విజయానికి 54 బంతుల్లో 100 రన్స్ కావాలి. డుప్లెసిస్, బ్రావో ఉండడంతో చెన్నై గెలుపు అవకాశాలు సజీవంగా ఉన్నాయి. కానీ, హాఫ్ సెంచరీకి చేరువైన డుప్లెసిస్, బ్రావో వెంటవెంటనే అవుటవడంతో ధోనీ సేన ఓటమి ఖాయమైపోయింది.