ఐపీఎల్ లో నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లు ఎన్నో చూశాం. కానీ ఈ సారి ఐపీఎల్ వేలం ముందే అభిమానుల్లో హై టెన్షన్ టెన్షన్. ట్రేడింగ్ వార్తలతో ఏ ప్లేయర్ ఏ జట్టుకు వెళ్తాడో తెలియని కన్ఫూయిజన్ మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా హార్దిక్ పాండ్య తిరిగి ముంబయి ఇండియన్స్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ ముంబయికి వెళ్తాడని ఎవరూ కలలో కూడా అనుకొని ఉండరు. సక్సెఫుల్ కెప్టెన్ గా హార్దిక్ గుజరాత్ ను రెండు సార్లు ఫైనల్స్ కు చేర్చాడు. అంతేగాక 2022 సీజన్ లో జట్టును విజేతగా నిలబెట్టాడు. కానీ తిరిగి ముంబయికి వెళ్లాడు. 2015లో ముంబయి తరఫున హార్దిక్ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

అయితే హార్దిక్ పాండ్య తిరిగి ముంబయికి చేరడంతో జస్ప్రీత్ బుమ్రా జట్టును వీడుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. రోహిత్ శర్మ తర్వాత ముంబయికి ఫ్యూచర్ కెప్టెన్ తానే అనుకుంటే.. హార్దిక్ రాకతో ప్లాన్ అంతా ఛేంజ్ అయిందని, అందుకే బుమ్రా జట్టును వీడుతున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. అదే టైమ్ లో బుమ్రా ''మౌనంగా ఉండటమే కొన్నిసార్లు ఉత్తమ సమాధానం'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ముంబయి ఇండియన్స్ పేజీని అతడు అన్ ఫాలో చేయడం.. ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి.
తాజాగా ముంబయి ఇండియన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో బుమ్రా ఫొటోను షేర్ చేస్తూ.. ''మౌనంగా ఉండటమే కొన్నిసార్లు ఉత్తమ సమాధానం'' అంటూ అదే కొటేషన్ పేర్కొంది. మరోవైపు బుమ్రా ముంబయి ఇండియన్స్ పేజీని తిరిగి ఫాలో చేయడం విశేషం. అసలు బుమ్రా ఎందుకు అన్ ఫాలో చేశాడు? తిరిగి ఎందుకు ఫాలో అయ్యాడని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
కాగా, ముంబయి ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యను అప్పగించే ముందు హార్దిక్ తమతోనే ఉంటాడని గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. కానీ కొన్ని గంటలకే హార్దిక్ ముంబయికి వెళ్లాడని మరో అఫిషియల్ స్టేట్ మెంట్ వచ్చింది. ఇదే తరహాలో ముంబయి ఇండియన్స్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తుందా? లేదా నిజంగానే బుమ్రా ముంబయితోనే ఉంటాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది.