ముంబై: నిలకడగా రాణిస్తున్న గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్పై రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచులో విజయం సాధించింది. చివరి ఓవరులో ఐదు పరుగుల తేడాతో కోల్కతాపై ముంబై గెలిచింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సొంత మైదానంలో రోహిత్సేన ఆల్రౌండ్ నైపుణ్యం ప్రదర్శించింది. హార్థిక్ పాండ్యా (31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 నాటౌట్) ఉతికి ఆరేయడం ముంబైకి కలిసి వచ్చింది. అదే విధంగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముంబైకి ఉపయోగపడింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పొలార్డ్ (33 నాటౌట్), రోహిత్ శర్మ (30) కూడా రాణించారు.
ఆ తర్వాత కోల్కతా ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేసింది. యూసుఫ్ పఠాన్ (52) పోరాడినా ఓటమి తప్పలేదు. పాండ్యా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో కోల్కతాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఊతప్ప-గంభీర్ తొలి వికెట్కు 45 పరుగులు జోడించారు. తొలి ఐదు ఓవర్లలో ఓపెనర్లు చెరో మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించారు. అయితే ఆరో ఓవర్లో ఊతప్ప (25)ను హర్భజన్ అవుట్ చేశాడు. తర్వాత మనీష్ పాండే (1) రనౌటయ్యాడు.

తొలి బంతికే యూసుఫ్ క్యాచ్ అవుటయ్యాడు. రెండో బంతిని ఉమేష్ బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతి వైడ్ కాగా ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. ఇక ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సి ఉండగా కోల్కతా ఒక్క పరుగు కూడా చేయలేదు.
అంతకుముందు కోల్కతా టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ అప్పగించింది. యువ బ్యాట్స్మన్ హార్థిక్ పాండ్యా పోరాటంతోనే ముంబైకి భారీ స్కోరు దక్కింది. పార్థివ్ పటేల్ (21)కు లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సిమన్స్ (14)ను మోర్కెల్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అంబటి రాయుడు (2) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత రోహిత్, పోలార్డ్ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు నడిపించారు.
చివరి 6 ఓవర్లలో హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్తో విజృంభించాడు. రస్సెల్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతిని ఫోర్ కొట్టి పాండ్యా తన సత్తాను చాటాడు. తర్వాత ఉమేష్ బౌలింగ్లో వరుసగా నాలుగు ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. 19వ ఓవర్లోనూ అతను రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టాడు. హార్థిక్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐదో వికెట్కు పొలార్డ్తో పాండ్యా 92 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.