
బెంగళూరు: బెంగళూరు వేదికగా సాగుతోన్న ఐపీఎల్ మెగా వేలంపాట రెండో రోజు- మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ఇనాక్టివ్గా కనిపించింది. మధ్యాహ్నం భోజన విరామం వరకూ పెద్దగా ప్లేయర్లను కొనుగోలు చేయలేదు. ఫస్ట్ హాఫ్లో జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండేలను జట్టులోకి తీసుకుంది. స్టార్ ప్లేయర్ల కోసం పోటీ పడినప్పటికీ.. దాన్ని విజయవంతంగా మలచుకోలేకపోయింది. ఇది- విమర్శకుల నోటికి పని చెప్పినట్టయింది.
తొలి రోజు ఇషాన్ కిషన్, డెవాల్డ్ ట్రెవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్ను రిటైన్ చేసుకోవడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అతని కోసం 15 కోట్ల 25 లక్షల రూపాయలను చెల్లించడానికి కూడా వెనుకాడలేదు. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో పోటీ పడింది ముంబై. ఇంకో రెండు కోట్ల రూపాయలు పెరిగినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టుగా వ్యవహరించింది.
ఇషాన్ కిషన్ విషయంలో 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి వెనుకాడని ముంబై ఇండియన్స్- రెండో రోజు కూడా అదే తరహాలో వేలంపాటను డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ మొదట్లో అంచనాలు వెలువడినప్పటికీ- వేలంపాట ఫస్ట్ హాఫ్ సాగే కొద్దీ నీరసంగా కనిపించిందా ఫ్రాంఛైజీ. జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండేను తీసుకోవడానికే పరిమితమైంది. ఆశ్చర్యకరంగా ఓడియన్ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఎయిడెన్ మార్క్రమ్ కోసం పోటీ పడలేదు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ.. వ్యవహారంపై మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, కామెంటేటర్ హర్షా భోగ్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ముంబై వ్యూహాలను అర్థం చేసుకోలేకపోతున్నానంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. గెలుపు గుర్రాల్లాంటి ప్లేయర్లు అమ్ముడుపోతున్నా.. వారి కోసం పెద్దగా ఫైట్ చేయకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇర్ఫాన్ పఠాన్- తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో ముంబై ఇండియన్స్ పేరు మీద ఓ ఎమోజీని పోస్ట్ చేశాడు.
హర్షాభోగ్లే కూడా ఇదే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. రిటైన్ చేసుకున్న కేప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ కీరన్ పొల్లార్డ్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లకు తోడుగా.. కొత్తగా జట్టులోకి ఇషాన్ కిషన్, డెవాల్డ్ ట్రెవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ వచ్చారు. ఇవ్వాళ జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండేను తీసుకుంది ఇప్పటిదాకా. ఇంకా 15 మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.