హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్కు ఇంక కొన్ని రోజులే మిగులున్నాయి. ఏప్రిల్ 5న హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
అయితే ఐపీఎల్ 10వ ఎడిషన్కు సంబంధించి ముంబై ఇండియన్స్ జట్టు టికెట్ల అమ్మకాలను మొదలు పెట్టింది. ముంబైలోని వాంఖడెలో జరిగే మ్యాచ్ల టికెట్లను అధికారిక పాట్నర్ జియో మనీతో కలిసి అమ్మకానికి ఉంచింది. మార్చి 22 నుంచి ఆన్లైన్ ద్వారా టిక్కెట్లను విక్రయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 9న కోల్కతా నైట్ రైడర్స్తో ముంబై తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక మూడో గేమ్లో భాగంగా ఏప్రిల్ 16న గుజరాత్ లయన్స్తో జరిగే మ్యాచ్ ద్వారా వచ్చే నగదును రిలయన్స్ ఫౌండేషన్ వారి 'ఎడ్యుకేషన్ ఫర్ ఆల్'కు అందిచనుంది.
పేదపిల్లలైన లక్ష మంది చిన్నారులకు విద్య అందించాలన్న లక్ష్యంతో ఈ సంస్థ పని చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మ్యాచ్కు ఎన్జీవోల సాయంతో పెద్ద సంఖ్యలో పేద విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించి ప్రచార కార్యక్రమాలను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, నీతా అంబానీలు ఇప్పటికే మొదలు పెట్టారు.
ఇదిలా ఉంటే వాంఖడే స్టేడియంలో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. సునీల్ గవాస్కర్ స్టాండ్లోని టికెట్ రూ.800, సచిన్ టెండూల్కర్ హాస్పిటాలిటీ స్టాండ్లోని టికెట్కు రూ.8,000గా నిర్ణయించారు. ఇక కార్పోరేట్ బాక్స్లోని టిక్కెట్ ధరలు రూ.12వేల నుంచి రూ.30వేల వరకు నిర్ణయించారు. బాక్సాఫీస్ ధరలను త్వరలో వెల్లడించనున్నారు.