ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లక్ష్య ఛేదనలో మరో ఏడు బంతులు మిగిలి ఉండగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ విషయంలో ముంబయి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటికే 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ వర్మను.. 18.5 ఓవర్లో అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ చేసింది. కానీ ముంబయి తీసుకున్న ఈ నిర్ణయం బోల్తా కొట్టింది. ముంబయి ఓటమిని అందుకుంది.
అయితే తిలక్ వర్మ విషయంలో ముంబయి తీసుకున్న ఈ రిటైర్ ఔట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ గెలవడం కోసం ముంబై తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిడంతో.. హర్భజన్ సింగ్, సునీల్ గావస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ముంబయి జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయి జట్టు తాము తీసుకున్న ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చింది.

హార్ధిక్ పాండ్యా ఏమన్నాడంటే..?
మ్యాచ్ అనంతరం తిలక్ రిటైర్డ్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. మాకు కొన్ని భారీ షాట్లు అవసరమయ్యాయి. కానీ తిలక్ వర్మ ధాటిగా ఆడలేకపోయాడు. క్రికెట్ లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కొన్ని సార్లు అనుకున్నవి జరగవు. కాబట్టి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. అని హార్దిక్ వివరణ ఇచ్చాడు.