ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ భిన్నంగా సాగింది. ప్రత్యర్థి జట్లతో పోరు కంటే ఇంటి గొడవలతోనే సతమతమైంది. సీజన్ ప్రారంభానికి ముందు 'కెప్టెన్సీ మార్పు' నిర్ణయం జట్టుపై తీవ్ర ప్రతికూలత చూపించింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య నేతృత్వంలో ముంబై జట్టులో రెండు గ్రూప్లు ఏర్పడ్డాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కథనాలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూస్తే అవి వాస్తవమే అనిపించింది.
ఈ సీజన్లో నాలుగు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇవాళ సొంతమైదానంలో వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గి సీజన్ను విజయంతో ముగించాలని ముంబై భావిస్తోంది. అయితే ఐపీఎల్-2025 ముందు మెగా వేలం జరగనుంది.

ఈ సీజన్ అనంతరం ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ముంబై ఇండియన్స్ మెగా వేలానికి ముందు నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య, మాజీ సారథి రోహిత్ శర్మలను జట్టు నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దానికి గల కారణాలు వివరించాడు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను ముంబై రిటైన్ చేసుకుంటుందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఏకీభవించాడు.
''నాకో విషయం చెప్పండి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి నటిస్తే, ఆ సినిమా హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పగలరా? అలా కుదరదు. అందులో వాళ్లు చక్కగా నటించాలి, అలాగే కథ బాగుండాలి. ముంబై ఇండియన్స్లోనూ అంతే. స్టార్ ఆటగాళ్లంతా కలిసి ఉన్నా, గొప్పగా ఆడితేనే విజయం సాధించవచ్చు. రోహిత్ శర్మ ఓ సెంచరీ సాధించాడు. కానీ ముంబై ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో మిగిలిన ఆటగాళ్లు ఏం ప్రదర్శన చేశారు?''
''ఈ సీజన్ మొత్తం ఇషాన్ కిషన్ ఆడాడు. కానీ పవర్ప్లే ముగిసేలోపే వికెట్ కోల్పోతున్నాడు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ముంబై ఇండియన్స్లో సత్తాచాటుతున్నారు. వాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. రిటైన్ లిస్ట్లో వాళిద్దరూ టాప్లో ఉంటారు. మిగిలిన మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు ఎంపిక అవుతారో చూడాలి'' అని వీరూ అన్నాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలపై మనోజ్ తివారీ స్పందిస్తూ.. బుమ్రా, సూర్యను మాత్రమే రిటైన్ చేసుకోవాళ్లని, వారిద్దరిలో ఒకరిని కెప్టెన్గా నియమించాలని అన్నాడు.