
అబుదాబి: సన్రైజర్స్ హైదరాబాద్తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించిన ముంబై 42 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ మనీశ్ పాండే (69) చివరి వరకు పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. పాండేకు మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో సన్రైజర్స్కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు ఓపెనర్లు జేసన్ రాయ్ (34), అభిషేక్ శర్మ (33) రాణించగా.. ప్రియమ్ గార్గ్ (29) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్ నైల్, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు జేసన్ రాయ్, అభిషేక్ శర్మ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. ఆపై స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. కెప్టెన్ మనీష్ పాండే నిలకడగా ఆడినా.. మహమ్మద్ నబి (3), అబ్దుల్ సమద్ (2) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో ప్రియమ్ గార్గ్ (29)తో పాండే ఇన్నింగ్స్ను చక్కదిద్దినా.. ముంబై బౌలర్ల ధాటికి గార్గ్ సహా జేసన్ హోల్డర్ (1), రషీద్ ఖాన్ (9), వృద్ధిమాన్ సాహా (2) ఔట్ అయి పోయారు. దాంతో మనీష్ ఒంటరి పోరాటం వృధా అయింది. ముంబై విజయాన్ని అందుకున్నా.. ప్లే ఆఫ్ బెర్త్ మాత్రం దక్కలేదు. మెరుగైన రన్ రేట్ ఉన్న కోల్కతాకే నాలుగో స్థానం దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (84: 32 బంతుల్లో 11x4, 4x6) క్రీజులో ఉన్నంతసేపూ మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (18) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రషీద్ ఖాన్ వేసిన 5.3 బంతికి ఔట్ అయ్యాడు. వికెట్ పడినప్పటికీ ఇషాన్ దాటిగానే ఆడాడు. ఈ క్రమంలోనే ఇషాన్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అదే సమయంలో 7.2 ఓవర్లలోనే ముంబై స్కోరు వంద పరుగులు దాటింది. అయితే హార్డ్ హిట్టర్ల హర్దిక్ పాండ్యా (10), కీరన్ పొలార్డ్ (13) ఆకట్టుకోలేకపోయారు. త్వరగానే పెవిలియన్ చేరారు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఇషాన్ కిషన్ మాత్రం పరుగుల వరద పారించాడు. ఇషాన్ ఊపు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ అతడి జోరుకు కళ్లెం వేశాడు. మాలిక్ వేసిన పదో ఓవర్లో ఇషాన్ కీపర్ వృద్దిమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (82: 40 బంతుల్లో 13x4, 3x6) ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సూర్య కూడా సిక్సులు, ఫోర్లతో అలరించాడు. ఈ క్రమంలోనే అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో చివరి ఓవర్లో ఔట్ అయ్యాడు. జేమ్స్ నీషమ్ (0), కృనాల్ పాండ్యా (9), నాథన్ కౌల్టర్ నైల్ (3), పియూష్ చావ్లా (0) రాణించలేకపోయారు. చివర్లో బుమ్రా (5), బౌల్ట్ (0) నాటౌట్గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు.