ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడుతూ ముంబై ఫ్రాంచైజీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబై జట్టును ఉద్దేశిస్తూ.. అది తాను నిర్మించిన దేవాలయం అని, కానీ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయని హిట్మ్యాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఈడెన్కు చేరుకున్న ముంబై జట్టు సాధన చేసింది. అంతేగాక కేకేఆర్ జట్టుతో కలిసి ముంబై ప్లేయర్లు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కోల్కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్తో కలిసి రోహిత్ ముచ్చటించాడు. దీనికి సంబధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

అయితే ఈ వీడియోలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ పేరును ప్రస్తావించకుండా రోహిత్ ఆవేదనతో మాట్లాడాడు. ''అన్నీ ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. ఇదంతా వాళ్లపై ఆధారపడి ఉంది.నేను ఏమీ పట్టించుకోవట్లేదు. ఏదేమైనా, అది నా ఇల్లు, నేను నిర్మించుకున్న దేవాలయం. మొత్తానికి ఇదే నా చివరిది'' అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ఈ సీజన్లో హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందించిన విషయం తెలిసిందే. ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సీజన్ ఆరంభంలో హార్దిక్ను రోహిత్ అభిమానులు హేళన చేశారు. ముంబై ఫ్రాంచైజీపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూప్లుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఈ విషయాలన్ని జట్టుపై తీవ్ర ప్రతికూలతను చూపించాయి. అంతిమంగా ఈ సీజన్లో టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుగా ముంబై నిలిచింది. ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేక ఎలిమినేట్ అయ్యింది.